T20 women’s World Cup: ఓపెనర్లు విఫలమైనా.. మిడిల్ ఆర్డర్ ఆదుకుంది.. వెస్టిండీస్ పై భారత జట్టు ఎలాంటి ఫలితం అందుకుందంటే?

దుబాయ్ వేదికగా ఐసీసీ టి20 మహిళల వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. త్వరలో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు నిర్వహిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు వెస్టిండీస్ జట్టుతో తలపడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 30, 2024 12:43 pm

T20 women's World Cup warm up match

Follow us on

T20 women’s World Cup:  దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. టీమిండియాలో ఓపెనర్లు సఫాలీ వర్మ (7), స్మృతి మందాన (14) స్వల్ప పరుగులకే అవుట్ అయ్యారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (1) పూర్తిగా నిరాశపరిచింది. ఈ దశలో జేమీమా(52), యాస్తిక (24) సత్తా చాటారు. వెస్టిండీస్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా భారత మహిళల జట్టు స్కోరు 141 పరుగులకు చేరుకుంది.. జట్టు స్కోర్ 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు షఫాలివర్మ ఔట్ అయింది. ఆ తర్వాత జట్టు స్కోరు 21 పరుగులకు చేరుకున్నప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ పెవిలియన్ చేరుకుంది. 23 పరుగులకు స్మృతి మందాన అవుట్ అయింది. ఈ దశలో యాస్తిక, జెమిమా నాలుగో వికెట్ కు 50 పరుగులు జోడించారు. ఈ దశలో జట్టు స్కోరు 73 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు యాస్తిక అవుట్ అయింది. ఈ దశలో జెమీమా రెచ్చిపోయి ఆడింది. రీఛాగోష్ తో కలిసి 21 పరుగులు జోడించింది. ఆ తర్వాత జట్టు స్కోరు 113 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు జెమీమా అవుట్ అయింది. ఆ తర్వాత అరుంధతి రెడ్డి, పూజ వస్త్రాకర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. ఫలితంగా భారత జట్టు స్కోరు 141 పరుగులకు చేరుకుంది. వెస్టిండీస్ జట్టులో హేలీ నాలుగు వికెట్లు పడగొట్టింది. అస్మిని , చినెల్లె తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

వెస్టిండీస్ జట్టుకు చుక్కలు చూపించారు

142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 121/8 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ముగించింది . వెస్టిండీస్ జట్టులో ఓపెనర్లు హేలీ(0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగింది. రేణుకా సింగ్ బౌలింగ్ లో హేలి క్లీన్ బౌల్డ్ అయింది. కియానా జోసెఫ్ (1) పరుగు మాత్రమే చేసి వస్త్రాకర్ బౌలింగ్ లో అవుట్ అయింది. ఈ దశలో షేమైన్(20), చెడియన్ (59) భారత బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు మెరుగైన భాగస్వామ్యం అందించారు. ఈ దశలో శోభన షేమైన్ ను అవుట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన జైదా (1), అలియా (0) నిరాశపరిచారు. చివర్లో వచ్చిన ఆఫీ ఫ్లేచర్(21) ధాటిగా ఆడినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో వెస్టిండీస్ జట్టుకు ఓటమి తప్పలేదు. పూజా వస్త్రాకర్ మూడు వికెట్లు పడగొట్టింది. దీప్తి రెండు వికెట్లు దక్కించుకుంది. రేణుకా సింగ్, ఆశా శోభన, రాధా యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయం ద్వారా మహిళల టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని హర్మన్ ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది.