Woman Returns 10 Crore Bank Mistake: ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు. ఒక మనిషి జీవితానికి కీలకమైన ఇంధనం డబ్బు. అటువంటి డబ్బు కోసం మనుషులు ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. బంధాలను వదులుకుంటారు. విలువలను పాతేస్తారు. డబ్బుంటే చాలు.. ప్రపంచం మొత్తం కాళ్ళ ముందు ఉంటుందని అనుకుంటారు. అయితే కొంతమంది విలువలను పాటిస్తూ ఉంటారు. అచ్చం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ లాగా. విలువల చుట్టూ.. నైతికత చుట్టూ తిరుగుతూ.. తమ జీవితానికి స్వార్థకత లభించే విధంగా చేస్తుంటారు. అటువంటిదే ఈ స్టోరీ కూడా..
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
ఆమె పేరు రీటా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్ పూరి జిల్లా లో రీటా తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. రీటా దంపతులకు వ్యవసాయ భూమి ఉంది. పిల్లలు కూడా ఉన్నారు. రీటా తన భర్తతో కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల రీటా బ్యాంక్ అకౌంట్లో పది కోట్లు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది.
రీటాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎకౌంటు ఉంది. ఇటీవల ఆమె వ్యవసాయ పనులు చేస్తుండగా ఫోన్ కు మెసేజ్ వచ్చింది. అందులో 10 కోట్ల జమ అయినట్టు కనిపించింది. దీంతో రీటా ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. వారు ఆ డబ్బును డ్రా చేద్దామని.. ఖరీదైన స్థలాలు.. బంగారం కొనుగోలు చేద్దామని చెప్పారు. దానికి ఆమె అసలు ఒప్పుకోలేదు. ఇది మన సొమ్ము కాదు.. మనం తీయాల్సిన అవసరం లేదు.. ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే ఊరుకోనని రీటా హెచ్చరించింది. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు వేచి చూడాలని సూచించింది.
ఇక మరుసటి రోజు రీటా బ్యాంకు అధికారులను కలిసింది. తన ఖాతాలో 10 కోట్లు జమ అయిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు ఎకౌంట్ చెక్ చేశారు. ఆ తర్వాత ఆ డబ్బు ఎక్కడ జమ అయ్యింది.. ఎలా జమైంది.. అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అయితే బ్యాంకు అధికారులు తప్పు వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. దీనిపై అధికారులకు విచారణ సాగిస్తున్నారు. పది కోట్లు ఖాతాలో ఉన్నప్పటికీ.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రీటా నిజాయితీతో వ్యవహరించడాన్ని బ్యాంకు అధికారులు అభినందిస్తున్నారు. వాస్తవానికి నేటి కాలంలో పరాయివాడి సొమ్ము కోసం ఆశపడే మనుషులు ఎక్కువైపోయారు. అలాంటి చోట ఇలాంటి వారు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.