Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ ఇటీవల కదా టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు.. ఐర్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. అతడు జాతీయ జట్టులో ఆడుతుంటే చూడాలని తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతున్నారు. అతనితోపాటు ఐర్లాండ్ కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పైగా సూర్య వంశీ తమ్ముడు కూడా దుమ్ము రేపుతున్నాడు. స్థానిక టోర్నీలలో అదరగొడుతున్నాడు.
ఇంతటి అనుకూలతలు వైభవ్ సూర్య వంశీ చుట్టూ ఉంటే.. ఒక బ్యాడ్ న్యూస్ మాత్రం అతడిని వెంటాడుతోంది. అతడి అభిమానులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. వైభవ్ సూర్య వంశీ భారత జట్టుతో కలిసి ఐర్లాండ్ గడ్డమీద అడుగుపెట్టాడు. అక్కడ ప్రాక్టీస్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాలని అతడు బలంగా నిర్ణయించుకున్నాడు. తోటి ప్లేయర్ల మద్దతు కూడా అతడికి విపరీతంగా ఉంది. పైగా ఇటీవల శ్రీలంక సిరీస్ లో కూడా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అటువంటి సూర్య వంశీకి ఒక చేదు వార్త ఎదురైంది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగే టి20 సిరీస్ ల కోసం వైభవ్ జట్టు ప్లేయర్లతో కలిసి ఇప్పటికే యూకే చేరుకున్నాడు. ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 16 సంవత్సరాల లోపు ప్లేయర్లు పెద్దల డ్రెస్సింగ్ రూమ్ లు వాడకూడదు. మ్యాచ్ కు ముందు.. ఆ తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన గదిని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
15 సంవత్సరాల సూర్య వంశీ కోసం ఇంగ్లాండు క్రికెట్ బోర్డు ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించింది. అయితే ఈ గదిలో కేవలం సూర్య వంశీ కి మాత్రమే అవకాశం ఉంటుంది. తోటి ప్లేయర్లతో అతడు మాట్లాడొచ్చు. జట్టు సమావేశంలో పాల్గొనవచ్చు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనలు ఇలా ఉండడంతో.. సూర్య వంశీ అభిమానులు షాక్ అవుతున్నారు. బుడ్డోడికి ఏంటి ఇలాంటి పరీక్షలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మనదగ్గర మాత్రం ఇలాంటి నిబంధనలు ఉండవు. ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవచ్చు. వారితో పాటు ఉండొచ్చు. సరదాగా మాట్లాడుకోవచ్చు. జట్టు సమావేశాలలో పాల్గొనొచ్చు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ నిబంధనను ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. 15 ఏళ్ల సూర్యవంశీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దగా మినహాయింపులు ఇవ్వలేదు.
