spot_img
Homeక్రీడలుక్రికెట్‌BAN v SL : ఇదేం ఫీల్డింగ్ రా సామి.. లగాన్ సినిమాను గుర్తుకు తెచ్చారు..

BAN v SL : ఇదేం ఫీల్డింగ్ రా సామి.. లగాన్ సినిమాను గుర్తుకు తెచ్చారు..

BAN v SL : క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో.. ఫీల్డింగ్ కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ను ఇప్పటికీ ఆరాధిస్తున్నాం. యువరాజ్ సింగ్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నాం. మహమ్మద్ కైఫ్ బంతులను ఆపే విధానాన్ని ఇప్పటికీ చర్చించుకుంటున్నాం.. వీరు మాత్రమే కాదు వర్తమాన క్రికెట్లో ఎంతోమంది ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ తో అభిమానులను అలరించారు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఫీల్డింగ్ కు సంబంధించిందే. అది ఎలాంటిదంటే “న భూతో న భవిష్యత్తు” అనే పదం కూడా చిన్న పోతుంది.

శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రస్తుతం రెండవ టెస్టు జరుగుతోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కాబట్టి ఈ మ్యాచ్ కు అంతటి ప్రాధాన్యం లభించడం లేదు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో మూడవరోజు ఆటలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదే ఈ మ్యాచ్ ను వార్తల్లో అంశం చేసింది. శ్రీలంక ఆటగాడు కొట్టిన బంతిని ఆపడానికి బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు ఫీల్డర్లు పరిగెత్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్లిప్ ఫీల్డర్ లతోపాటు గల్లీ ఫీల్డర్ కూడా బంతిని ఆపేందుకు పరిగెత్తారు. చివరికి గల్లీ ఫీల్డర్ ఆ బంతిని ఆపి.. తనని అనుసరించిన థర్డ్ స్లిప్ ఫీల్డర్ కు అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహమూద్ వేసిన 21 ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. హసన్ బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. క్రీజ్ లో ఉన్న శ్రీలంక బ్యాటర్ జయసూర్య థర్డ్ మ్యాన్ వైపు షాట్ కొట్టాడు. దీంతో బంగ్లా ఫీల్డర్ల బృందం మొత్తం ఆ బంతిని ఆపేందుకు పరిగెత్తింది. ఆ ఫీల్డర్లు పరిగెత్తుతున్న తీరు హాస్యాస్పదంగా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ” ఇదేం ఫీల్డింగ్ రా సామి.. దెబ్బకు లగాన్ సినిమాను గుర్తుకు తెచ్చారు అంటూ” కామెంట్స్ చేస్తున్నారు..

కాగా ఈ మ్యాచ్ ను శ్రీలంక జట్టు తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటికే 45 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. మూడవరోజు ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లకు 106 పరుగులు చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 531 పరుగుల స్కోర్ చేసింది. కరుణ రత్నే 86, కుశాల్ మెండిస్ 93, కామిందు మెండిస్ 92*, నిషాన్ మధుశంక 57, దినేష్ చండిమల్ 59 పరుగులు చేసి రాణించారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 178 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆసితా ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ జట్టును వణికించాడు.. బంగ్లా ఆటగాళ్లల్లో హసన్ (54) మాత్రమే రాణించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version