Homeక్రీడలుక్రికెట్‌Asia Cup Women 2024: ఆసియా కప్ లో పాక్ ప్రస్థానం ముగిసింది.. ఫైనల్ లోకి...

Asia Cup Women 2024: ఆసియా కప్ లో పాక్ ప్రస్థానం ముగిసింది.. ఫైనల్ లోకి శ్రీలంక ఎంట్రీ.. భారత్ తో టైటిల్ ఫైట్ ఎప్పుడంటే?

Asia Cup Women 2024: ఆసియా కప్ లో పాకిస్తాన్ ప్రస్థానం ముగిసింది. దంబుల్లా వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా.. శ్రీలంక ఫైనల్ లోకి దూసుకెళ్లింది. టైటిల్ కోసం జూలై 28న భారత జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుంది. పాకిస్తాన్ పురుషుల జట్టు కూడా టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. అయితే మహిళల జట్టు మాత్రం సెమీస్ దాకా వచ్చింది. అయితే సెమీస్ లో శ్రీలంక ముందు పాకిస్తాన్ తేలిపోయింది. అంతకుముందు టీమ్ ఇండియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ గుల్ ఫిరోజా (25), మునిబా అలీ (37), అమీన్(10), నిదా దార్(23), అలియా రియాజ్ (16*), ఫాతిమాసనా(23*) సత్తా చాటడంతో పాకిస్తాన్ 140 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో అచ్చిని కుల సూర్య రెండు వికెట్లు పడగొట్టింది. ప్రియదర్శిని, ప్రబోధిని, కవిషా తల ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే పాకిస్తాన్ ప్లేయర్లు పవర్ ప్లే లో 45 పరుగులు సాధించడం విశేషం.

141 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు చివరి వరకు పోరాడింది. పాకిస్తాన్ విధించిన 141 రన్స్ టార్గెట్ ను 19.5 ఓవర్లలో పూర్తి చేసింది. ఓపెనర్ విష్మీ 0 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్, కెప్టెన్ చమరి ఆటపట్టు (63) పరుగులు చేసి శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించింది. హర్షిత 12, కవిష 17, అనుష్క సంజీవని 24, సుగంధికా కుమారి 10 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న నీలాక్షి 0 పరుగులకే అవుట్ కావడం శ్రీలంక అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ మ్యాచ్ ద్వారా శ్రీలంక ఫైనల్ దూసుకెళ్లింది. జూలై 28న జరిగే టైటిల్ ఫైట్ లో భారత జట్టుతో శ్రీలంక అమీతుమీ తేల్చుకొనుంది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో సాదియా ఇక్బాల్ నాలుగు వికెట్లు పడగొట్టింది. నిదా దార్, ఓమైమా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. శ్రీలంక జట్టు పవర్ ప్లేయర్ 35 పరుగులు మాత్రమే చేయగలిగింది.

0 పరుగులకే విష్మీ వికెట్ ను శ్రీలంక కోల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు హర్షిత వికెట్ ను నష్టపోయింది. ఈ క్రమంలో కవిషా, కెప్టెన్ చమరి శ్రీలంక ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 59 పరుగులు జోడించారు. అవే శ్రీలంక విజయానికి బాటలు పరిచాయి. అయితే అప్పటిదాకా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పాకిస్తాన్ బౌలర్లు.. ఆ తర్వాత తమ లయను కోల్పోయారు. దీనిని శ్రీలంక బ్యాటర్లు అనుకూలంగా మలచుకున్నారు. చివరి వరకు పోరాడి లక్ష్యాన్ని సాధించారు. టైటిల్ పోరు లో భాగంగా సొంత దేశంలో భారత జట్టుతో జూలై 28న అమీ తుమీ తేల్చుకోనున్నారు. అయితే ఇప్పటికే ఈ టోర్నీలో భారత జట్టు వరుస విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular