IPL 2026 impact on Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఘనంగా ముగిసింది. బెంగళూరు జట్టు మరోసారి విజేతగా నిలిచింది. తద్వారా తన ఖాతాలో 2వ ట్రోఫీని జమ చేసుకుంది. ఐపీఎల్ నడుస్తున్నంత సేపు టీమిండియా అంతర్జాతీయ టోర్నీలు ఆడదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత మళ్లీ టీమిండియా తన క్రికెట్ వేటను సాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రయాణం ఏంటి.. ఎటువంటి టోర్నీలు ఆడుతుంది.. ఏ ఏ దేశాలతో పోటీ పడుతుంది.. అనే అంశాలపై పూర్తిస్థాయి కథనం ఇది.
వచ్చే ఏడాది ఐపీఎల్ జరిగే వరకూ టీమిండియా దాదాపు పది టెస్టులు ఆడుతుంది. 20 వన్డే మ్యాచ్లు.. 23 t20 లు ఆడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఒక టెస్ట్, 3 వన్డేలు ఆడుతుంది. ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20 లు, ఇంగ్లాండ్ జట్టుతో 5 t20 లు, 3 వన్డేలు, జింబాబ్వే జట్టుతో మూడు టి20 లు, శ్రీలంక జట్టుతో రెండు టెస్టులు, వెస్టిండీస్ జట్టుతో 3 వన్డేలు, 5 t20 మ్యాచ్ లు, న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 t20 మ్యాచ్ లు ఆడుతుంది, శ్రీలంక జట్టుతో 3 వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది, జింబాబ్వే తో 3 వన్డే మ్యాచ్లు ఆడుతుంది. ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టెస్టులు ఆడుతుంది. మధ్యలో ఆసియా గేమ్స్ కూడా ఉన్నాయి.
టీమిండియాకు టి20 లలో, వన్డేలలో పెద్దగా ఇబ్బంది లేదు. కేవలం టెస్టుల్లో మాత్రమే టీమిండియా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. స్వదేశం, విదేశాలలో జరిగిన టోర్నీలలో ఓడిపోయి పరువు తీసుకుంటున్నది. వైట్ బాల్ ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ.. రెడ్ బాల్ లో మాత్రం తీవ్రంగా తడబడుతున్నది. ఇది ఒక రకంగా ఆ జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే రెడ్ బాల్ సిరీస్ లలో టీమిండియా సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. గతంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టుకు దారుణమైన పరాభవం ఎదురయింది. దానినుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. బదులు తీర్చుకోవాలి.
2027 లో వన్ డే ప్రపంచ కప్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. టీమిండియా దాదాపు సగం జట్ల మీద వన్డే సిరీస్ లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆ సిరీస్ లను తనకు అనుకూలంగా మార్చుకొని.. విజయాలు సాధించగలిగితే.. 2027 ప్రపంచ కప్ కు సానుకూలంగా తన ప్రయాణాన్ని సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే జట్టు పగ్గాలు గిల్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి.. జట్టులో యువ రక్తం తొణికిసలాడుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
