Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma : అభిషేక్ శర్మ దూకుడు ముందు ఈ భీకర ఆటగాళ్లు దిగదుడుపే..

Abhishek Sharma : అభిషేక్ శర్మ దూకుడు ముందు ఈ భీకర ఆటగాళ్లు దిగదుడుపే..

Abhishek Sharma : “అతడు ఆడుతుంటే మైదానం చిన్నబోతోంది. ఫోర్లు సులువుగా కొడుతున్నాడు. సిక్సర్లు సునాయాసంగా బాదుతున్నాడు. అతడికి బౌలింగ్ వేయాలంటే చాలా కష్టం. అతడిదైనా రోజు ఎలాగైనా బ్యాటింగ్ చేయగలడు. అతడిది కాని రోజు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడికి టి20 క్రికెట్ ను శాసించే సత్తా ఉంది.” ఐపీఎల్ లో అభిషేక్ శర్మకు బౌలింగ్ వేసిన తర్వాత ఆస్ట్రేలియా టాప్ బౌలర్ కామెరూన్ గ్రీన్ చేసిన వ్యాఖ్యలు ఇవీ. అతడు ఏ ముహూర్తాన ఆ వ్యాఖ్యలు చేశాడో తెలియదు కాని.. వాటిని నిజం చేసి చూపిస్తున్నాడు టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ. టి20 లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ ఏడాదిలో 18 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ.. 250 కు పైగా స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు. ఏకంగా 584 రన్స్ కొట్టేశాడు. ప్రస్తుత టి20 క్రికెట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఈ స్థాయిలో మరే ఆటగాడికి స్ట్రైక్ రేట్ లేదు. అభిషేక్ శర్మ ముందు ఆండ్రీ రసెల్(199.47) , జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్(194.13), ట్రావిస్ హెడ్(176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా తేలిపోయారు.

ఎడమచేతి వాటం బ్యాటర్ గా అభిషేక్ శర్మ టి20లలో సంచనాలను సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగి.. పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ హెడ్ తో కలిసి ముంబై, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్ లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన ఘనతను సృష్టించాడు. ఫైనల్లో కోల్ కతా చేతిలో తేలిపోయాడు గాని.. లేకుంటే హైదరాబాద్ జట్టు తలరాత మరో విధంగా ఉండేది. వాస్తవానికి ఎటువంటి అంచనాలు లేకుండా ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ.. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు.

ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో ఉన్న అభిషేక్ శర్మ.. రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి టి20లో డక్ అవుట్ అయినప్పటికీ.. రెండవ టి20 మ్యాచ్లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మతో పాటు ఈ మ్యాచ్లో రుతు రాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77*, రింకూ సింగ్ 22 బంతుల్లో 48* చెలరేగి ఆడారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది. వాస్తవానికి 10 ఓవర్ల దాకా భారత జట్టు నిదానంగా ఆడింది. ఆ తర్వాతి 10 ఓవర్లలో ఓవర్ కు 16 పరుగుల చొప్పున 160 రన్స్ చేసింది. టి20 క్రికెట్లో సరికొత్త రికార్డును సృష్టించింది. తొలి టి20 మ్యాచ్లో ఓడిపోయిన భారత జట్టు.. రెండో టి20 మ్యాచ్లో అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్ వల్ల ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ ఈ స్థాయిలో సత్తా చాటుతుండడం పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. ఆ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేస్తాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version