Cricket Stadium 5 Star Hotel: క్రికెట్ కు, మన దేశానికి విడదీయరాని సంబంధం ఉంది. ఇంగ్లాండ్ లో క్రికెట్ పుట్టినప్పటికీ.. మన దేశం ద్వారానే క్రికెట్ అనేది విశ్వవ్యాప్తమైంది. మనదేశ క్రీడలైన హాకీ, కబడ్డీ, ఖో ఖో కంటే కూడా క్రికెట్ ఆడేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తుంటారు.
క్రికెట్ ద్వారా డిసిసిఐ ప్రతి ఏడాది వేలకోట్ల ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది. వచ్చిన ఆదాయంలో కొంత భాగం క్రికెట్ అభివృద్ధికి కేటాయిస్తూ ఉంటుంది. మనదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన స్టేడియాలు ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో క్రికెట్ మైదానాలు ఉన్నాయి. ఈ మైదానాలను బీసీసీఐ స్థానిక క్రికెట్ సంఘాల ద్వారా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ అందుబాటులోకి రావడంతో దేశంలోని ప్రతి క్రికెట్ స్టేడియంలో కూడా మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ కంకణం కట్టుకుంది. ధర్మశాల నుంచి మొదలుపెడితే రాంచి వరకు.. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే కొచ్చి వరకు దాదాపు అన్ని స్టేడియాలలో ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తోంది బీసీసీఐ.
ప్రపంచ స్థాయిలో క్రికెట్ స్టేడియాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. బిసిసిఐ ఆదాయం కోసం మాత్రమే క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉంటుందని.. మైదానాల నిర్వహణ సరిగా ఉండదని విమర్శలు వినిపిస్తుంటాయి. ఆమధ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఈ విమర్శలు ప్రముఖంగా వినిపించాయి.
ఇంగ్లాండ్ దేశంలోని మైదానాలతో.. మనదేశంలోని క్రికెట్ మైదానాలను పోల్చి చూశారు కొందరు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆ తరహా విమర్శలకు సరైన సమాధానం చెప్పడానికి బీసీసీఐ కొంతకాలంగా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజుల రాష్ట్రంగా పేరు పొందిన రాజస్థాన్లో ఏకంగా ఒక అద్భుతమైన క్రికెట్ మైదానాన్ని రూపొందించింది రాడిసన్ గ్రూప్. అయితే ఇందులో ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్లో నచ్చిన ఆహారాన్ని తింటూ.. మ్యాచ్ చూడవచ్చు. బాల్కనీలో కూర్చొని ఆటగాళ్ల విన్యాసాలను వీక్షించవచ్చు. ఈత కొలను లో ఈత కొట్టుకుంటూ క్రికెట్ మ్యాచ్ లు చూడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు అక్కడ ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఈ తరహా ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు.
క్రికెట్ మీద ప్రజల్లో ఆసక్తిని పెంచడానికి.. రాడిసన్ గ్రూప్ ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఆస్వాదించుకుంటూ క్రికెట్ చూడడమంటే మామూలు విషయం కాదని మాజీ క్రీడాకారులు చెబుతున్నారు.