గత కొంతకాలంగా ప్రజల్లో కరోనా వైరస్ భయాలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో 2020 ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలు ఈసీ రమేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పలువురు వైసీపీ నేతలు ఆయనను వ్యక్తిగతంగా దూషించడం అనేది వారి దిగజారిన రాజకీయాలకు సూచనగా ఉందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.
“నమ్మగడ్డ రమేష్ కుమార్ కి చంద్రబాబు వైరస్ సోకందని” మంత్రి పేర్ని నాని విమర్శించగా, “ఆయనకు కుల పిచ్చి ఉందని, ఆయనను చూసి సిగ్గుపడాలని, ఆయనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని పిలవొద్దని, నారావారి గబ్బిలం అని” పిలవాలని మంత్రి విజయ్ సాయి రెడ్డి విమర్శించాడు. అంతేకాకుండా సీఎం జగన్ కూడా ఈసీ ని పలు విధాలుగా విమర్శించారు. “ఆయనని మేము నియమించలేదని, చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న అధికారని, ఆయన విచక్షణను కోల్పోయి (పిచ్చిపట్టి) ప్రవర్తిస్తున్నారని సీఎం జగన్ విమర్శించడం గమనార్హం.
అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనే ఒక రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తిపట్ల వ్యక్తిగత విమర్శలు చేయడంపై జగన్ సర్కార్ పై వ్యతిరేకత గళం వినిపిస్తోంది. రాజకీయాలలో ప్రతిపక్ష,పాలక పక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉండటం సహజం. కానీ, చట్ట బద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తిపట్ల, అదే విధంగా “రైట్ టు రిప్లై” ని అమలపరచలేని వ్యక్తిపట్ల, వైసీపీ నేతలు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఎంతవరకు సబబు?. ఈసీ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేయొచ్చు కానీ ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడం న్యాయం కాదనేది అనేకమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
భారతీయ చట్ట పరిధిలో ఉన్న వ్యక్తిపై రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల వారి స్థాయిని వారే తగ్గించుకుంటున్నారని, అందులో సీఎం జగన్ కూడా ఉండటం గమనార్హం అని, దీంతో ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.