PM Modi Lok Sabha Speech: మోడీ సిక్సర్ల బ్యాటింగుకి విలవిలలాడిన కాంగ్రెస్

అంతకుముందు రాహుల్ గాంధీ తనను దృతరాష్ట్రుడితో పోల్చడం పట్ల నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. రెండు గంటల పది నిమిషాల పాటు ప్రసంగించి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఎండ కట్టారు

Written By: NARESH, Updated On : August 11, 2023 3:21 pm

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో లోక్ సభ లో వాడి వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో అంతకుముందు రాహుల్ గాంధీ తనను దృతరాష్ట్రుడితో పోల్చడం పట్ల నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. రెండు గంటల పది నిమిషాల పాటు ప్రసంగించి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఎండ కట్టారు.”పక్షాలు ఎవరి గురించైనా చెడుగా ఆలోచిస్తే వారికి కచ్చితంగా మంచే జరుగుతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. వారు నల్ల దుస్తులు ధరించి వస్తే నాకు దిష్టి తీసినట్టే. నా హయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కుప్ప కూలిపోయాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అవి ఇప్పుడు భారీ లాభాలతో నడుస్తున్నాయి. హెచ్ ఏ ఎల్, ఎల్ఐసి లపై కూడా వాళ్ళు చేసిన విమర్శలు తప్పయ్యాయి. విపక్షాలు ఏ ప్రభుత్వ సంస్థలపై విమర్శలు చేస్తాయో.. వాటిపై షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే కచ్చితంగా లాభాలు వస్తాయి” అని మోడీ ఎద్దేవా చేశారు.

“రాహుల్ గాంధీ ఎన్నిసార్లు విఫలమైనప్పటికీ ఆయనను పదేపదే ప్రయోగిస్తుంటారు. 400 సీట్లు నుంచి 40 సీట్ల వరకు ఆ పార్టీ పడిపోయింది భారతదేశంపై విదేశీ సంస్థలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రచారం చేసి సంతోషపడతారు. హనుమంతుడు దహనం చేయలేదని, రావణుడి అహంకారమే దహనం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అహంకారమే ఆ పార్టీ దుస్థితికి కారణమని” మోడీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, సిక్కిం తమిళ నాడు, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, అస్సాం, పంజాబ్ వంటి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పై ప్రజలు ఏనాడో అవిశ్వాసం ప్రకటించారని, రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ తిప్పి కొట్టారని మోడీ ధ్వజమెత్తారు. భరతమాతను హత్య చేశారని రాహుల్ గాంధీ మాట్లాడటం సరికాదని, ఆ వ్యాఖ్య ద్వారా ప్రతి భారతీయుడి మనోభావాలు గాయపడ్డాయని మోడీ విరుచుకుపడ్డారు. “వీళ్లే కొంతకాలం కిందట ప్రజాస్వామ్య హత్య, రాజ్యాంగ హత్య అని కూడా మాట్లాడారు. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే దేశం మూడు ముక్కలైంది. 1966 మార్చి 5న ఇందిరా గాంధీ హయాంలోనే మిజోరాం రాష్ట్రంపై వాయిసేనతో దాడులు చేయించారు. ఆ రోజులు ఇంకా ఆ రాష్ట్ర ప్రజలు విషాద దినంగానే పరిగణిస్తారు. కాంగ్రెస్ హయాంలోనే కచ్చ తీవును శ్రీలంక దేశానికి అప్పగించారు..అఖల్ తఖ్త్ పై దాడి జరిగింది ఆనాడే అని” మోడీ ధ్వజమెత్తారు.

మోడీ సిక్సర్ల బ్యాటింగుకి విలవిలలాడిన కాంగ్రెస్ తీరుపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.