ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక ఘటన సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒక మహిళ ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు, ఇబ్బందులకు గురి చేసిన తీరుపై సామాన్యులు మండిపడుతున్నారు. వికరాంగురాలు అయిన ఒక మహిళ నుంచి పోలీసులు డీజిల్ కోసం అని చెప్పి 15 వేల రూపాయలు వసూలు చేయడంతో పాటు ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఓపిక నశించిన ఆ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని కాన్పూర్కు చెందిన గుడియా అనే వికరాంగురాలైన మహిళ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆ మహిళకు ఒక కూతురు కాగా వ్యవసాయం చేసి మహిళ జీవనం సాగించేది. అయితే కొన్ని రోజుల క్రితం మహిళ మైనర్ కూతురు కిడ్నాప్ అయింది.
గుడియా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కూతురు కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు కూతురును వెతకడానికి డీజిల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని కోరగా మహిళ అప్పు తెచ్చి పోలీసులకు 15 వేల రూపాయలు ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకున్న పోలీసులు మహిళతో ” నీ కూతురు ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో” అంటూ అసభ్యంగా మాట్లాడారు.
కూతురు కిడ్నాప్ గురించి చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా అసభ్యకరంగా పోలీసులు మాట్లాడటంతో గుడియా ఉన్నతాధికారులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్టేషన్ ఎస్హెచ్ఓను విధుల నుంచి తొలగించి గుడియా ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవాలని మరో అధికారికి సూచనలు చేశారు.