BJP: ఆ రెండే బీజేపీ అస్త్రాలు.. తెలంగాణలో పనిచేస్తాయా!

దేశంలో మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలోనే ఆ పార్టీకి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : February 23, 2024 11:01 am

BJP

Follow us on

BJP: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ మరో వారం పదిరోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇక తెలంగాణలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్‌ ఉంది. అదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లోనూ 10 నుంచి 14 సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తోంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగు స్థానాల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇక జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ 2019 ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాలపై గురిపెట్టింది.

మోదీ తీన్మార్‌..
దేశంలో మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలోనే ఆ పార్టీకి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే విజయసంకల్ప యాత్ర పేరుతో ప్రచారం ప్రారంభించింది. మొత్తం ఐదు క్లస్టర్లుగా 17 లోక్‌సభ స్థానాలను విభజించుకుని యాత్ర కొనసాగిస్తోంది. మరోసారి మోదీని గెలిపిద్దాం అనే నినాదంతో యాత్రను కొనసపాగిస్తున్నారు. మోదీ క్రేజ్, అయోధ్య రామమందిరం ఈరెండే ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగిస్తోంది. ఈ రెండే పార్టీకి మైలేజీ తెస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.

500 ఏళ్ల కల సాకారం..
భారతీయుల 500 ఏళ్ల కలను సాకారం చేసిన నేతగా మోదీని జాతీయస్థాయిలో బీజేపీ ప్రమోట్‌ చేస్తోంది. అదే సమయంలో పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ రెండు అస్త్రాలతోనే తెలంగాణలో 8 నుంచి 10 సీట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. నాడు బీజేపీకి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు. ఇక ఇప్పుడు అసెంబ్లీలో సీట్లు, ఓట్లు పెరిగాయి. దీంతో ఈసారి రెట్టింపు స్థానాల్లో గెలవాలని టార్గెట్‌ పెట్టుకుంది. రామ భక్తులను అయోధ్యకు తీసుకెళ్లడం, మోదీ ఫొటోలతో కూడాని కార్డులు ఇంటింటికీ పంనిణీ చేయడం వంటి కార్యక్రమాలతో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మరి తెలంగాణ నేతల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.