Homeజాతీయ వార్తలుBJP Politics: ఢిల్లీలోని అక్బర్ రోడ్డుకున్న ప్రాధాన్యత ఏమిటి..? బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆ పేరు...

BJP Politics: ఢిల్లీలోని అక్బర్ రోడ్డుకున్న ప్రాధాన్యత ఏమిటి..? బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆ పేరు మార్చుతోంది..?

BJP Politics:  దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక అక్బర్ రోడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఈ రోడ్డులో అందరూ ప్రముఖులే నివాసం ఉంటారు… మొదటి లోక్ సభ స్పీకర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న వారికి ఈ రోడ్డులో ప్రత్యేకంగా భవనమే నిర్మించారు.. అంతేకాకుండా ఇతర పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రముఖులంతా ఎక్కడుంటారంటే అక్బర్ రోడ్డు పేరే వినిపిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత అక్బర్ రోడ్డు అనే పేరు వినిపించే అవకాశం ఉండదు. సూచికల కోసం సైతం అక్బర్ రోడ్డు ను వాడుకున్న వారు ఇక నుంచి ఈ రోడ్డును వేరే పేరుతో పిలిచే అవకాశం ఉంది. అలా పేరు మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోంది. ఎన్నో ఏళ్ల కింద పెట్టుకున్న ఈ పేరు ఇక నుంచి వేరే పేరుతో పిలిచేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే వెళ్లాయి. అయితే అక్బర్ రోడ్డుకున్న ప్రాధాన్యత ఏంటి..? ఆ పేరును ఎందుకు మార్చాలనుకుంటున్నారు..? ఇక నుంచి ఈ రోడ్డును ఏ పేరుతో పిలవాలి..?

లూటెన్స్ ఢిల్లీలోని అక్బర్ రోడ్డు ప్రముఖమైంది. ఈ రోడ్డులో ఎన్నో సంవత్సరాల నుంచి వేప, చింత, రావి చెట్లు ఉంటున్నాయి. మొఘల్ చక్రవర్తి స్మారకంగా దీనికి అక్బర్ రోడ్డు అని పేరు పెట్టారు. ఈ రోడ్డులో 1977 నవంబర్ 24 నుంచి ప్రధాని కార్యాయలం కొనసాగుతోంది. 1952 నుంచి లోక్ సభ స్పీకర్లు ఈ రోడ్డులోని 20 అంతస్థుల భవనంలో ఉంటున్నారు. అయితే ఈ రోడ్డుకు పేరు మార్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల కొందరు ఈ రహదారిలో ఉన్న సైన్ బోర్డు పై నల్ల రంగు వేశారు. దీంతో అక్బర్ పేరు మార్చేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

1931లో న్యూ ఢిల్లీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆంగ్లేయుడు ఎడ్విన్ లూటెన్ రాజధాని రూపు రేఖలు మార్చేశారు. ఢిల్లీలోని దాదాపు పెద్ద పెద్ద భవనాలన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. అలా ఢిల్లీకి రూపురేఖలు వచ్చాక రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా అల్ బుకర్క్ రోడ్డు పేరును మార్చారు. ఆయన పేరు మార్చి ‘30 జనవరి మార్గ్’ గా నామకరణం చేశారు. మహాత్మగాంధీ తన చివరి 144 రోజులు ఈ రోడ్డులోని బిర్లా హౌస్లో గడిపారు. అందుకు చిహ్నంగా పేరును మార్చాల్సి వచ్చింది. పోర్చుగల్ లో పుట్టిన అల్ బుకర్క్ గోవా గవర్నర్ గా చేసి మరణించారు.

అయితే తాజాగా డిల్లీలోని ప్రముఖ అక్బర్ రోడ్డు పేరును కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏ వైపు నుంచీ విమర్శలు రాకుండా ముందే వ్యూహం రచించింది. ఈ రోడ్డుకు ఇటీవల హెలీక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ పేరును పెట్టాలని చూస్తున్నారు. దీంతో ఈ పేరుపై ఎటువంటి రాజకీయ అలజడి లేకుండా ముందే ప్లాన్ వేసుకున్నారు. అంటే ముందు ముందు అక్బర్ రోడ్డు బిపిన్ రావత్ రోడ్డుగా మారే అవకాశాలున్నాయి. అక్బర్ రోడ్డును పవర్ రోడ్ అని కూడా అంటారు.

రహదారి పేరు మార్చడం అంత ఈజీ కాదు. ఇందులో విదేశాంగ శాఖ, ఎన్జీవో, స్థానిక ప్రజలు లాంటి వారు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు పంపించాల్సి ఉంటుంది. ఒకసారి ప్రతిపాదనలను అందిన తరువాత ఎన్ డీఎంసీ వాటిని తమ జనరల్ విభాగానికి పంపిస్తారు. ఆ తరువాత 13 మంది సభ్యుల పేర్లు మార్చే కమిటీ దానిని పరిశీలిస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదించినట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ పోస్టు మాస్టర్ జనరల్ కు పంపుతారని ఎండీ ఎంసీ మాజీ సమాచార డైరెక్టర్ మదన్ తప్లపియార్ తెలిపారు.

మొత్తంగా ఇప్పటికే యూపీలోని చారిత్రక ముస్లిం రాజులు, ప్రముఖుల పేర్లను యోగి ప్రభుత్వం మార్చేసింది. పలు నగరాలను ‘బాద్’ తీసేసి హిందూ పేర్లకు మార్చింది. ఇప్పుడు ఆ సంస్కృతిని కేంద్రంలోని బీజేపీ కూడా అలవరుచుకుంది. హిందుత్వవాదాన్ని రగిలించేందుకు వారి అభిమానాన్ని చూరగొనేందుకు బీజేపీ ఈ పని చేసినా మైనార్టీ వర్గాల్లో మాత్రం దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  అయితే చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడుతోంది. చారిత్రక పేర్లను తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కరెక్ట్ అంటుండగా.. మరికొందరు తప్పు పడుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version