Earthquake : తెలంగాణలో భూ ప్రకంపనలు కలకలం రేపుతోంది. వారం కూడా కాకముందే మరోసారి భూమి కంపించడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భూకంపాలు వణికిస్తున్నాయి. దక్కన్ పీఠభూమిపై ఉన్న ఉత్తర తెలంగాణలో అసలు ఈ భూకంపాలు అస్సలే రావద్దు.. మరి ఎందుకు వస్తున్నాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కేసీఆర్ సర్కార్ ఎత్తైన గుట్టల్లో భారీగా సర్జిపూల్స్ (మహా బావి)లను తవ్వేసింది. ఒక టీంఎసీ పట్టేలా అతిపెద్ద బావులను ఉత్తర తెలంగాణలో ఎత్తిపోతల పథకాల వద్ద నిర్మించింది. ఈ క్రమంలోనే వీటి వల్ల ఏమైనా భూ కదలిలకతో భూకంపాలు వస్తున్నాయా? అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశంగా దక్కన్ పీఠభూమిగా పేర్కొన్నారు. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం, విదర్భ రాష్ట్రాల కింద ఉంది. హైదరాబాద్ అత్యంత సేఫ్ సిటీ అని.. ఇక్కడతోపాటు తెలంగాణ, విదర్భలో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ అని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా ఉత్తర తెలంగాణలో భూకంపాలు రావడం అందరినీ షాక్ కు గురిచేసింది.
ఉత్తర తెలంగాణలో వారం కిందట కరీంనగర్, పెద్దపల్లి, మంచి ర్యాల జిల్లాలో భూకంపం వచ్చింది. భూమి మధ్యాహ్నం 2.03 గంటలకు కంపించడంతో జనాలు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది. దీంతో భూకంపం వచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం 2.03గంటలకు ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కి.మీల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ప్రకటనలు భారీగా వచ్చాయి. మంచిర్యాలలోని రాంనగర్, గోసేవా మండల్ కాలనీ, నస్పూర్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోంచి పరుగులు తీశారు.
తెలంగాణలో ఇప్పటివరకూ భూకంపాలు నమోదు కాలేదు. కానీ తొలిసారి ఇలా భూమి కంపించడం కలకలం రేపింది. జనాలు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆరుబయటే సంచరించారు. ఈ ప్రకంపనలు ఆగుతాయా? కొనసాగుతాయా? అన్నది వేచిచూడాలి.
మంచిర్యాల జిల్లాలో తాజాగా మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. వరుస భూప్రకంపనలు ఇప్పుడు జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా భూకంపం మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదైందన్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉంటుంది. అందుకే మంచిర్యాలలోనూ భూమి కంపించింది.కొమురం భీం జిల్లా కౌటాల, పెంచికల్ పేట, బెజ్జూరు మండలాల్లోనూ భూమి కంపించింది.