PM Modi : మోడీ ఏదో ప్లాన్ చేశాడు.. ఆ రహస్యం బిజెపికీ తెలియదు.. మిగతా పార్టీలకు అంతు పట్టదు

అవసరమైతే ఓటింగ్ కూడా ఉంటుంది కదా. అందరికీ కాపీలు ఇస్తారు కదా. ఇందులో అప్రజాస్వామికం ఏముంది? కొంపతీసి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించరు కదా?!

Written By: K.R, Updated On : September 18, 2023 10:29 pm

PM_Modi

Follow us on

PM Modi : పాత పార్లమెంట్ భవన్ లోనే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసలు ఈ సమయంలో అకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాలు ఎందుకు? అనేది బయటికి తెలియడం లేదు. నేషనల్ మీడియా సర్కిల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మహిళా బిల్లు అని, జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు అని.. రకరకాల కథనాలను వండి వారుస్తున్నాయి. ఇక స్థానిక మీడియా అయితే తనకు తోచింది రాసుకుంటున్నది. ఇక “నమస్తే తెలంగాణ” అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశాడు కాబట్టి.. మోడీ కాళ్ల బేరానికి వచ్చి మహిళా బిల్లు ప్రవేశపెడతాడు, మా కవిత నిరసన వ్యక్తం చేసింది కాబట్టి.. ఈ బిల్లు ఆమోదానికి నోచుకుంటున్నది తెలుసా? అని రాసుకు వస్తోంది. సరే ఇవన్నీ లెక్కలోకి రావు కాబట్టి.. అప్పటివరకు సోషల్ మీడియాలో ప్రచారానికి నోచుకుంటాయి కాబట్టి.. వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మోడీ ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది.. సొంత పార్టీ వాళ్లకే ఏ సమాచారం లేదు. లీక్ కావద్దనే భావనతో కొందరు ముఖ్యులకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వడం లేదు. దీని మొత్తాన్ని ప్రధానమంత్రి ఆఫీస్ ఆర్గనైజ్ చేస్తోంది. ఫలితంగా విపక్షాలు ఏం జరుగుతుందో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి.

నోట్ల రద్దు సమయంలో ఎంత టాప్ సీక్రసీ మెయింటైన్ చేశాడో తెలుసు కదా.. కనీసం సొంత పార్టీ వాళ్లకు కూడా నరేంద్ర మోడీ చెప్పలేదు. చివరికి ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతున్నప్పుడే సొంత పార్టీ నేతలకు తెలిసింది. సరే దాని ఆచరణ విషయాన్ని పక్కన పెడితే ఆ గోప్యతను పాటించిన విధానం మాత్రం సూపర్.. అయితే దేశ రక్షణకు సంబంధించి, విదేశాంగ విధానాల గురించి.. ఇతర కీలక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి సమాచారం ముందుగా బయటకు రావడం అంత మంచిది కాదు. కానీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎజెండాను రహస్యంగా ఉంచుతున్న తీరును తప్ప పటాల్సిన పనిలేదు. భారత రాష్ట్ర సమితి సహా పలు పార్టీలు నెత్తి కొట్టుకుంటున్న తీరు, వాళ్ళ వ్యాఖ్యల్లో, పత్రిక ప్రకటనలో కనిపిస్తోంది.’ అతడు ఏం మాట్లాడుతాడు అతడికే అర్థం కాని మేధావి, ఆక్రమించని నిజాయితీపరుడు, అత్యంత పేద నాయకుడైన కేకే కూడా ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని” అంటున్నాడు.. ఢిల్లీలోని కాకలు తీరిన పాత్రికేయులు సైతం జుట్టును పీక్కుంటున్నారు. అన్ని సోర్సుల్లోనూ సమాచారం సేకరిస్తున్నారు. అయినప్పటికీ ఉపయోగం ఉండటం లేదు. అసలు పార్టీ వర్గాలకు సమాచారం లేనప్పుడు, బిజెపి నాయకులు మాత్రం మీడియాకు ఎలా లీక్ చేయగలరు?

దీంతో ఎవరికి తోచిన ఊహాగానాలను వారు చేసేస్తున్నారు. కామన్ సివిల్ కోడ్ బిల్లు అని కొందరు, మహిళా బిల్లు అని మరి కొందరు, జమిలి ఎన్నికల బిల్లు అని మరికొందరు రాస్తున్నారు. కొందరైతే ఏకంగా ముందస్తు ఎన్నికల దాకా వెళ్ళిపోయారు.. వాస్తవానికి తమ ఎంపీలకు విప్ జారీ చేసిన బిజెపి.. మొదటిరోజు పార్లమెంట్ ప్రస్థానంపై చర్చ అని మాత్రమే చెప్పింది. మహిళా బిల్లు అయ్యే పక్షంలో ముందుగానే అందరికీ చెప్పి, ముందస్తు ప్రచారం కూడా చేసుకుని, పూర్తిగా తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కదా! బహుశా అది కాదనుకుంటా..జమిలి బిల్లు పెట్టే పక్షంలో కేవలం ఒక బిల్లు సరిపోదు. పైగా బీజేపీకి రాజ్యసభ ఓట్లు సరిపోవు కాబట్టి సంయుక్త సమావేశం పెట్టాలి..అవీ ఆర్థిక సంబంధ బిల్లులైతేనే, విశేష సందర్భాలు అయితేనే ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఉంటాయి. కామన్ సివిల్ కోడ్ బిల్లు పెట్టే పక్షంలో దేశం మొత్తం ఎన్నికల సందర్భంగా చర్చ జరగాలని బిజెపి కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్లు జోలికి పోకపోవచ్చు. ప్రతి బిల్లుకు కూడా సాధ్యాసాధ్యాల పరిమితులు కనిపిస్తున్నాయి. పోనీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కబంధహస్తాల నుంచి విముక్తం చేసే బిల్లా.. దానికి పార్లమెంటు ముందస్తు ఆమోదం పొందాల్సిన పనిలేదు. పైగా మన దేశంలో విపక్షాలు ఎలా ఉంటాయో తెలుసు కదా.. పాకిస్తాన్ అయినా తల ఊపుతుందేమో గాని విపక్షాలు మాత్రం సై అనవు. సరిహద్దుల్లో ఆ సన్నద్దత కూడా ఏమీ లేదు. పోనీ కులగణనకు సై అంటుందా? దానికి ప్రత్యేక తీర్మానాలు, ఆమోదాలు అక్కరలేదు. మరి ఏమై ఉండొచ్చు? ఇందాక మనం చెప్పుకున్నది కేవలం గోప్యత గురించి మాత్రమే. ఢిల్లీ పాలకుల కోటలు సమాచారాన్ని ఏమాత్రం బయటికి రానివ్వడం లేదు అనే కదా మనం ప్రస్తావించింది. చివరగా.. అయ్యా అతిపేద రాజ్యసభ సభ్యుడైన కేకే గారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ బిల్లు పెట్టినా పార్లమెంటులోనే కదా.. అన్ని పార్టీల ఎంపీలు చర్చిస్తారు కదా. అవసరమైతే ఓటింగ్ కూడా ఉంటుంది కదా. అందరికీ కాపీలు ఇస్తారు కదా. ఇందులో అప్రజాస్వామికం ఏముంది? కొంపతీసి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించరు కదా?!