CM KCR Master Plan: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఆయన స్కెచ్ వేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. వ్యూహం రచించారా.. ఉద్దండులైనా యుద్ధ క్షేత్రం నుంచి పరుగులు పెట్టాల్సిందే. పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ‘మోదీ.. నువ్వు గోగినా గోక కున్నా.. నిన్ను గోకుతనే ఉంటా’ ఇదీ మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్ అన్న మాట. అన్నట్లుగానే గులాబీ బాస్ కేంద్రాన్ని.. ప్రధాని నరేంద్రమోదీని తరచూ గోకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. నాటి ఓటుకు నోటు వ్యవహారం అయినా, ఇప్పటి ఫామ్ హౌస్ బేరసారాల రాజకీయ వ్యాపారమైనా లెక్క వేసి కొడితే ప్రత్యర్థికి మైండ్ బ్లాంక్ కావాల్సిందేనని మరోసారి నిరూపించారు.

తన జోలికి వస్తే అంతే..
తన జోలికి వచ్చే వారిని గురిచూసి దెబ్బకొట్టడం.. మట్టి కరిపించడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. వ్యూహాలు రచించడమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడంలోనూ గులాబీ బాస్ దిట్ట. టీఆర్ఎస్ పార్టీ ప్రకటన నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న కేసీఆర్.. ఇక పనైపోయిందనుకున్న ప్రతీసారి రివ్వున లేచారు. రాజకీయాలను లెక్క కట్టడంలో ఆరితేరారు. ప్రత్యర్థి దెబ్బ కొడదామని ఆలోచించేలోగానే తాను దెబ్బ కొట్టి చూపించారు. ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాలవైపు పయనం మొదలు పెట్టారు. ఈ క్రమంలో తనపై జరిగే దాడిని ముందుగానే ఊహించారు. తొలి అడుగు పడకముందే.. ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టాలనుకున్నారు.
ప్రత్యితర్థుల వ్యూహాన్ని పసిగట్టి..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రత్యర్థులు ఎర వేస్తున్న వ్యూహాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముందుగానే పసిగట్టారు. రివర్స్ ఆపరేషన్తో వారి ప్లాన్ను చిత్తు చేశారు. రాష్ట్రంలో ఒక్కప్పుడు బలమైన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని ఒక్క దెబ్బతో మట్టికరిపించారు కేసీఆర్. ఓటుకు నోటు కేసుతో కోలుకోలేకుండా చేసి తెలంగాణలో టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. ఇప్పుడు అదే స్థాయిలో దూసుకొస్తున్న బీజేపీనీ టార్గెట్ చేశారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని..
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. తన ప్రత్యర్థిగా బీజేపీనే ఎంచుకున్నారు. ఈ క్రమంలో తనకు వస్తున్న బెదిరింపులనూ లెక్క చేయలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయలేని పనిని సులువుగా, తెలివిగా చేసి చూపించారు. ఢిల్లీ నుంచి పన్నిన వ్యూహాన్ని దూదిపింజలా గాల్లో తేలిపోయేలా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల బండారాన్ని బయటపెట్టి ప్రత్యర్థికి కక్కలేని మింగలేని పరిస్థితి కల్పించారు కేసీఆర్.

బీజేపీ బెదిరింపులతో అప్రమత్తం..
టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని, గులాబీ పార్టీ కుప్పకూలడం ఖాయమంటూ కొన్ని రోజులుగా బీజేపీ నేతలు కేసీఆర్ను బెదిరిస్తూ వస్తున్నారు. ఒక సమయంలో వరుసగా టీఆర్ఎస్ నాయకులకు కాషాయ కండువాలు కప్పేశారు. బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని గాలికి వదిలేసిందని, తెలంగాణ ఉద్యమకారులంతా టీఆర్ఎస్ను వీడుతారని బీజేపీ ప్రకటించింది. ఇక తెలంగాణ ఉద్యమ పార్టీ తమదే అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే కేసీఆర్ వ్యూహం మార్చారు. బీజేపీ నుంచి వరుసగా ఉద్యమకాలం నాటి తన పాత మిత్రులను తిరిగి కారెక్కించారు. ఇప్పుడు తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పక్కదారి పట్టకుండా గట్టి ప్లాన్ చేశారు కేసీఆర్. దీనికి కౌంటర్ అటాక్ వస్తుందని ముందే ఊహించి ఫామ్హౌస్ బేరసారాలను పక్కా ప్లాన్తో గండికొట్టారు గులాబీ బాస్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని పక్కా సమాచారంతో పోలీసులు బ్రేక్ చేశారని బయటకు కనిపిస్తున్నా.. దీని వెనుక సీఎం కేసీఆర్ పక్కా వ్యూహరచన ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఎమ్మెల్యేలను తానే ఎరగా వేసి ప్రత్యర్థి పార్టీ బేరసారాల రాజకీయాలను బట్టబయలు చేశారో.. లేక నిజంగానే జరుగుతున్న ఎమ్మెల్యేల బేరసారాల ప్రయత్నాలను గుర్తించి దెబ్బకొట్టారో కానీ.. కేసీఆర్ దెబ్బ మాత్రం అదుర్స్ అనిపించింది. అట్లుంటది కేసీఆర్తోని..! అని మరోసారి నిరూపణ అయింది.