Eetala vs KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీ బాస్కు ఈటల టెన్షన్ పట్టుకుంది. కేసీఆర్ను ఓడించేందుకు గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చాలాకాలంగా ప్రకటిస్తున్నారు ఈటల రాజేందర్. తాజాగా కూడా హుజూరాబాద్, గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న గులాబీ బాస్కు ఈటెల కాలులో మల్లులా తయారయ్యాడు. ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తే తనపై ఎంత ప్రభావం ఉంటుంది. తన మెజారిటీని ఎంతమేరకు తగ్గించగలుగుతారు అని లెక్కలు వేసుకుంటున్నారు .
తొలిసారి 20 వేల మెజారిటీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్కు 20 వేల ఓట్లకంటే తక్కువ మెజారిటీ వచ్చింది. ఇక 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 58 వేల మారిటీ సాధించారు. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ రికార్డు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పార్టీ లోకల్ లీడర్ల అభిప్రాయం. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే బీసీలకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని, టికెట్లు 22 మందికి మాత్రమే ఇచ్చిందనే అపవాదు ఆ పార్టీపై ఉన్నది. కనీసం ఒక్క ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలూ ఉన్నాయ. ఈ ఆ కారణంగానే పటాన్ చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్కు మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
మెజారిటీపై ముదిరాజ్ ఎఫెక్ట్..
మరోవైపు గజ్వేల్ బీఆర్ఎస్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. అసమ్మతి నేతలు బుధవారం పట్టణంలోని టీవైఆర్ గార్డెన్స్లో మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్కు ఈసారి ఓటు వేయొద్దని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఎని్నకల్లో కేసీఆర్ మెజారిటీపై ముదిరాజ్ల ప్రభాం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ పోటీ చేస్తే ముదిరాజ్ ఓట్లు చాలా వరకు ఆయనకే పడతాయని తెలుస్తోంది. బీసీలంతా ఆయనవైపు టర్న్ అవుతారనే అనుమానమూ లేకపోలేదు. ఈసారి ఏ మాత్రం ఓట్లు తగ్గినా అది ఈటల ఎఫెక్ట్ అనేది జనంలోకి వెళ్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది.
హరీశ్రావుకు బాధ్యతలు..
ఇదిలా ఉంటే గజ్వేల్ గెలుపు బాధ్యతలను కేసీఆర్ ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్రావుకు అప్పగించారు. బీసీ ఓట్ల పోలరైజేషన్ అంశం గుర్తించిన హరీశ్రావు లోకల్ లీడర్లతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపారు. డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి ఇప్పటి నుంచే ఏదైనా చేయాలని హరీశ్రావు వ్యూహ రచన చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రెండు పక్షాల మధ్యనే పోటీ నెలకొన్నది. ఈసారి కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఉండడంతో ఓట్ల చీలిక ప్లస్ అవుతుందా?.. లేక ముప్పు తెస్తుందా అని బీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ తప్పుకుని ముదిరాజ్ లేదా తెలంగాణ ఉద్యమకారులను నిలబెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్, హరీశ్రావే..