PM Modi – Lepakshi : యావత్ భారతవాణియే కాదు.. మోడీ సైతం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తిగా భక్తితో ఎదురుచూస్తున్నారు. రామాయణ ఘట్టంలో జరిగిన ప్రతీదాన్ని నెమరువేసుకుంటున్నారు. అంతేకాదు.. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టి ఆ రాముడి సేవలో పునరంకితం అవుతున్నారు.
తాజాగా హిందూ ఇతిహాసం రామాయణంలో ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు. సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత జటాయు అనే పెద్ద డేగ ఆమెను అనుసరించిన ప్రదేశం లేపాక్షి అని హిందువులు నమ్ముతారు.
రావణుడితో పోరాడి మరణిస్తున్న జటాయువు సీతా దేవి యొక్క అపహరణ గురించి కీలకమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. లేపాక్షిలోనే పడి చనిపోతుంది. లేపాక్షిలో రాముడిచే ‘మోక్షం’ అనే దైవిక విముక్తిని పొందుతుంది.
అయోధ్యలోని రామ్ మందిర్ ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ వేడుకకు కొద్దిరోజుల ముందు ప్రధానమంత్రి దక్షిణాదిలోని రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారు.
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో న్యూ డ్రై డాక్ తోపాటు ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీతో సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి దక్షిణాదిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేటి నుండి ఆంధ్రప్రదేశ్ , కేరళలో రెండు రోజుల పర్యటనలో ఉంటారు.
బుధవారం కేరళలోని గురువాయూర్ మరియు త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాల్లో ప్రధాని మోదీ ప్రార్థనలు చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
జనవరి 22న గర్భగుడిలో ఉంచే శ్రీరాముడి విగ్రహాన్ని చూసేందుకు లక్షలాది మంది యాత్రికులు అయోధ్యను సందర్శిస్తారని అంచనా. స్థానిక అధికారులు కూడా జనవరి 22న జరిగే వేడుకలో సందర్శకుల తాకిడిని తట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మెరుగైన భద్రతా చర్యలను చేపట్టారు. హాజరైన వారందరికీ దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు.
మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ‘రామ్ లల్లా’ లేదా రాముడి మూడు విగ్రహాల్లో ఒకదానికి ప్యానెల్ ఎంపిక చేసింది. దీన్నే అయోధ్య రామాలయంలో ప్రతిష్టిస్తారు. ముగ్గురు శిల్పులు చెక్కిన విగ్రహాల్లో శ్రీ యోగిరాజ్ రూపొందించిన నల్లరాతి రామ్ లల్లాను ప్యానెల్ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రామాలయం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం తెలిపారు.