Women wear Nighties : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లుఅవుతున్నా కూడా ఇంకా మన గ్రామాల్లో మూఢనమ్మకాలు , ఆధునిక పోకడలకు తావు లేకుండా పోతోంది. సంప్రదాయాల ముసుగులో ఇంకా మహిళలకు కట్టు ని‘బంధనాలు’ పెడుతున్న దుస్థితి నెలకొంది. ఇదేదో మహిళలు బురఖా వేసుకోకుండా వస్తే కాల్చి పడేసే అప్ఘనిస్తాన్ నో.. లేక మతతత్వ పాకిస్తాన్ లో పరిస్థితి కాదు.. అక్షరాల మన తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో పరిస్థితి. అవును.. ఇక్కడ మహిళలు ఏం వేసుకోవాలో గ్రామస్థులు నిర్ధారిస్తున్నారు.ఇష్టమొచ్చినట్టు దుస్తులు వేసుకుంటానంటే నిషేధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగటిపూట నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. పగటిపూట వీటిని వేసుకొంటే రెండు వేలు జరిమానా, చూసి చెప్పిన వారికి వెయ్యి బహుమానం ఇస్తారట.
ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు.
తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు… సంప్రదాయం ముసుగులో మహిళలకు కట్టుబాట్లు పెట్టడం అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. నచ్చిన దుస్తులు వేసుకొని తిరిగే హక్కును కాలరాస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.