Pawan Kalyan Varahi Yatra : వారాహి మూడో విడత యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. తొలి రెండు విడత యాత్రలు ఉభయగోదావరి జిల్లాల్లో పూర్తి చేశారు. మూడో విడత యాత్ర విశాఖ నగరంలో సక్సెస్ఫుల్ గా నడిచింది. అటు తరువాత ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో యాత్ర చేపడతారని అందరూ భావించారు. కానీ పవన్ అనూహ్యంగా రాయలసీమ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు నెలల పాటు పెండింగ్ సినిమాలను పూర్తి చేయడంతో పాటు సమాంతరంగా వారాహి యాత్ర చేపడతారని టాక్ నడుస్తోంది.
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర చేపడతారని సమాచారం. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవన్ యాత్రకు జన సమీకరణకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. జన సైనికులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారు. అయితే నాలుగో విడత యాత్రలోనైనా పవన్ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొత్తుల తో పాటు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తేనే ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ విషయంలో అన్నీ బాగున్నా.. జనసేన అభ్యర్థులను ప్రకటించడంలో వెనుకబడి పోతున్నారన్న అపవాదు ఉంది.
వచ్చే ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. టిడిపి,జనసేన కలిసి పోటీ చేస్తాయని.. వాటి మధ్య పొత్తు కుదిరింది అన్న టాక్ నడుస్తోంది. అటు బిజెపి నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో పొత్తుల అంశం స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. తాను ఏ పార్టీతో కలిసి నడుస్తాను.. సీట్లు ఎన్ని? తాను పర్యటించే ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరు? జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా? లేకుంటే పొత్తుల్లో భాగంగా టిడిపి అభ్యర్థ? బిజెపి క్యాండిడేటా? ఇటువంటి అంశాలపై క్లారిటీ ఇస్తే.. తన యాత్రకు ఒక సార్ధకత ఏర్పడుతుందని.. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలుగుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ప్రభుత్వంలో జనసేన కీలకమని.. పార్టీకి చెందిన పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను చట్టసభలకు పంపిస్తానని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేనకు ప్రాతినిధ్యం ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ తరుణంలో మూడు ప్రాంతాల్లోనూ బలమైన జనసేన అభ్యర్థులను గుర్తించాల్సిన అవసరం పవన్ కు ఉంది. కేవలం యాత్ర చేపట్టడమే కాకుండా.. ఎక్కడ బలంగా ఉన్నామో.. అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తే.. వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ అధికమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు జనసైనికులు సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. వారాహి నాలుగో యాత్రలో పొత్తులతో పాటు అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి జనసేనాని ఏం చేస్తారో చూడాలి.