Pawan Kalyan Politics: సినిమాలకు పవన్ లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారా? దసరాలోగా పెండింగ్ సినిమాలు పూర్తిచేసి పొలిటికల్ సెట్ లోకి అడుగు పెట్టనున్నారా? ఈ విషయం ఇప్పటికే దర్శక, నిర్మాతలకు చెప్పేశారా? అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. అయితే ఇది మెగా పవర్ అభిమానులకు నిరుత్సాహం కలిగించే వార్త అయినా.. ఆయన రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకే నిర్ణయం తీసుకోవడాన్ని మాత్రం వారు స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనే విషయం మీద ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అయితే ఆ సినిమాలన్నీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే దసరా లోపు తన పార్టు వరకు షూటింగ్ పూర్తి చేయాలని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైనా ఫరవాలేదని నిర్మాత, దర్శకులకు చెప్పినట్టు టాక్.. ఎందుకంటే ఇకపై ఆయన పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు వెళితే మళ్లీ సినిమాలు చేయడం అంత సులువు కాదు.. ఈ దసరా నుంచి మళ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు షూటింగ్ లకు గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.

-ఆ మూడు సినిమాలు…
గత కొన్నేళ్లుగా పవన్ కు విపరీతమై స్టార్ డమ్ పెరిగిపోయింది. రాజకీయాల్లో ఉండడం వల్ల మంచి మైలేజ్ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా పవన్ కలెక్షన్లను కొల్లగొడుతున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత అతి తక్కువ కాలంలో సముద్రఖని దర్శకత్వంలో ఒక తమిళ సినిమా రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అది పూర్తయిన వెంటనే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయాలని తొందర పెడుతున్నారని టాక్. ముఖ్యంగా భవదీయుడు భగత్ సింగ్ తర్వాత పూర్తిగా ఆయన బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం కోసం బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ జనసేన గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని పవన్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
-తిరుపతి నుంచి..
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు మీద ఉంది. మహానాడు సక్సెస్ కావడంతో ప్రజల మధ్య గడిపేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఆయన కుమారుడు లోకేష్ సైతం పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. టీడీపీతో జనసేన కలిసి నడుస్తుందన్న సంకేతాలు ఇచ్చిన పవన్…తెలుగుదేశంతో సమన్వయంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలకు పోటీగా ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటనలు చేపట్టనున్నారు. తమకు సెంటిమెంట్ గా భావించే తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉండడంతో.. అక్కడ నుంచి పర్యటన మొదలపెడతారని జనసైనికులు అంటున్నారు.







