Homeజాతీయ వార్తలుKTR : హతవిధీ.. క్రేన్ కు కట్టి పెట్టినా కేటీఆర్ కరుణించలేదే?

KTR : హతవిధీ.. క్రేన్ కు కట్టి పెట్టినా కేటీఆర్ కరుణించలేదే?

KTR : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తారని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీనికి ఆయా పార్టీలు కూడా కొన్ని అంశాలను పేర్కొంటున్నాయి. పీకే టీంను రంగంలోకి దించడం.. ఇటీవల అసెబ్లీలో రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలు ప్రకటించడం, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని ప్రకటించడం, సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించడం ముందస్తుకు సన్నద్ధమనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ముందస్తు ఖాయమే అన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎమ్మెల్యే టికెట్ల ప్రకటన షురూ చేశారు. గురువారం కరీంనగర్‌ పర్యటనకు వచ్చిన ఆయన స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షడ్రు, కరీంనగర్‌ ఎంపీకి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చేతులో ఓడిపోయి అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్లు ఎంపీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. దమ్ముంటే గంగులపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న గంగుల కమలాకర్‌ వెంటనే నిలబడి సభికులకు నమస్కరించారు. ఇది అక్కడున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. కేటీఆర్‌ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ మళ్లీ గంగులకే అని ముందస్తుగా ప్రకటించారని చర్చించుకున్నారు. కరీంనగర్‌ టికెట్‌ ప్రకటించినట్లుగానే ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తొలిటికెట గంగులకే దక్కిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంది ముందస్తు వ్యూహంలో భాగమనే ప్రచారమూ ఊపందుకుంది.

-వారి ఆశలపై నీళ్లు…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీనంగర్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆశిస్తున్నారు. ఈమేరకు ఆయన గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత మున్సిపల్‌ ఎన్నికల్లో తన సన్నిహితుడిని రాత్రికి రాత్రే మేయర్‌గా పదవి ఇప్పించుకున్నారు. సీఎం కేసీఆర్‌ ద్వారా సీల్డ్‌ కవర్‌లో అతడి పేరును పంపించేలా చేసుకున్నారు. దీంతో ఖంగుతినడం స్థానిక మంత్రి గంగుల వంతయింది. మరోవైపు తన వర్గాన్ని బోయినపల్లి బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ గంగులపై పోటీ చేయాలని బండి సంజయ్‌కు సవాల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది బోయినపల్లి వర్గాన్ని షాక్‌కు గురిచేసింది.

– ఇక కరీనంగర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నవారిలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ తొలి మేయర్‌ రవీందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. గంగుల వ్యతిరేక వర్గంగా ఈయనకు మొదటి నుంచి పార్టీలో ముద్ర ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ను రవీందర్‌ సింగ్‌ ఆశించారు. కానీ గంగుల చక్రం తిప్పి రవీందర్‌సింగ్‌కు టికెట్‌ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో రవీందర్‌ సింగ్‌ కూడా పార్టీని వీడారు. స్వంతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే అదునుగా గంగుల కమలాకర్‌ కూడా రవీందర్‌సింగ్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు. ఇందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులకు మున్సిపాలిటీ గతంలో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని మున్సిపల్‌ సిబ్బందితో కూల్చివేయించారు. దీనిపై అప్పట్లో రవీందర్ సింగ్‌ రచ్చ చేశారు. తర్వాత జరిగిన ఎన్నిల్లో ఓడిపోయినా.. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఆయన మళ్లీ సొంత గూటికి చేరారు. స్థానికంగా ఎవరినీ కలువకుండా నేరుగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యక్షమై మంత్రి గంగులకు షాక్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌ ఎమ్మెల్యే టికెట్‌ హామీతోనే రవీందర్‌సింగ్‌ సొంత గూటికి చేరారనే ప్రచారం జరిగింది.

-ఫ్లెక్సీలకు రవీందర్‌ సింగ్‌కు చోటివ్వని మంత్రి..

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్ పర్యటన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ భారీగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఓటములను నిర్దేశించే ప్రాజెక్టుగా భావిస్తున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ శంకుస్థాపన సందర్భంగా అడుగడుగునా కేటీఆర్‌ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. నగరమంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తర్వాత గంగుల ఫ్లెక్సీలు మాత్రమే కనిపించాయి. ఇతర నాయకులెవరూ ఫ్లెక్సీ, హోర్డింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు చాన్స్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో రవీందర్‌ సింగ్‌ భారీ ఫ్లెక్సీ తయారు చేయించి సిక్‌వాడీ వద్ద క్రెయిన్‌కు కట్టి వేలాడ దీశారు. ఇందులో మంత్రి కేటీఆర్, రవీరందర్‌ సింగ్‌ ఫొటోలు మాత్రమే కనిపించాయి. అయితే ఇంత చేసినా కేటీఆర్‌ మాత్రం సభలో కరీంనగర్‌ ఎమ్మెల్యే టికెట్ గంగులకే అని ప్రకటించడంతో రవీందర్‌ సింగ్‌ వర్గాన్ని షాక్‌కు గురిచేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version