
TATA IPL 2023: ఐపీఎల్ 16వ పండుగకు వేళయింది. ధోని.. ధోని.. అరుపులతో చెపాక్ స్టేడియం దద్దరిల్లిపోయే సమయం ఆసన్నమైంది. విరాట్ విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యేందుకు అభిమానుల కేరింతల్లో మునిగిపోయేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఇటు సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ ఆట చూసేందుకు తెలుగు అభిమానులు సై అంటున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంటా, బయట మ్యాచ్లతో పాత విధానంతో.. కొన్ని మార్పులతో కొత్తగా ముస్తాబైన ఐపీఎల్ వచ్చేసింది. శుక్రవారం నుంచి 16వ సీజన్ ప్రారంభం అవుతుంది. ఇక పరుగుల వేటలో.. వికెట్ల బాటలో అభిమాన ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలను చూడడమే ఆలస్యం. దాదాపు రెండు నెలలు ఇక టీ 20 కిక్కే కిక్కే.
మోదీ స్టేడియంలో ఆరంభ వేడుకలు..
కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి సీజన్ ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటీమణులు రష్మిక మంధాన, తమన్నా భాటియా నృత్యాలతో అలరించబోతున్నారు. స్టార్ గాయకుడు అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించనున్నాడు. ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభవుతాయి.
తొలి మ్యాచ్ నుంచే వినోదం..
వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్రమోదీ స్టేడియంలో సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొడుతుంది. గతేడాదే లీగ్లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ఐపీఎల్లో తొలిసారే కెప్టెన్గా గుజరాత్కు టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్య ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాట్తో, బంతితో సత్తాచాటుతున్నాడు. ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్న శుభ్మన్ గిల్.. ఐపీఎల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. అయితే జాతీయ జట్టు కోసం తొలి రెండు మ్యాచ్లకు మిల్లర్ దూరం కావడం గుజరాత్కు దెబ్బే. వేలంలో దక్కించుకున్న కేన్ విలియమ్సన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. ఆంధ్ర ఆటగాడు కేఎస్.భరత్ వికెట్ కీపర్ బ్యాటర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ బౌలింగ్లో కీలకం కానున్నారు. మరోవైపు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అతని సారథ్యంలోని చెన్నై ఎప్పటిలాగే బలంగా ఉంది. స్టోక్స్, డెవాన్ కాన్వె, రుతురాజ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, జడేజా, తీక్షణ, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ స్టోక్స్ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా ధోని మోకాలికి గాయమైంది. తొలి మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశముంది.
డబ్బుకు తగిన ప్రదర్శన ఇస్తారా..
ఐపీఎల్వచ్చిందంటే చాలు.. వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఈ సీజన్కు ముందు నిరుడు డిసెంబర్లో నిర్వహించిన వేలంలోనూ కొంతమంది ఆటగాళ్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టింది. లీగ్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర. ఇక కామెరూన్ గ్రీన్(రూ.17.5 కోట్లు)ను ముంబయి, స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను చెన్నై, నికోలస్ పూరన్(రూ.16 కోట్లు)ను లఖ్నవూ, హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు), మయాంక్ (రూ.8.25 కోట్లు)ను సన్రైజర్స్, శివమ్ మావి (రూ.6 కోట్లు)ని గుజరాత్, హోల్డర్ (రూ.5.75 కోట్లు)ను రాజస్థాన్, ముఖేష్ (రూ.5.5 కోట్లు)ను దిల్లీ, క్లాసెన్ (రూ.5.25 కోట్లు)ను సన్రైజర్స్ కూడా అధిక మొత్తం చెల్లించే సొంతం చేసుకున్నాయి. మరి ఈ ఆటగాళ్లు డబ్బుకు తగిన ప్రదర్శన ఇస్తారో లేదో చూడాలి.
ఈ స్టార్లు దూరం..
సీజన్ ఆరంభం కాకముందే జట్లకు ఆటగాళ్ల గాయాలు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే కొంతమంది స్టార్ ఆటగాళ్లు సీజన్కు పూర్తిగా దూరమయ్యారు. మరికొందరు కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. విల్ జాక్స్(ఆర్సీబీ), ప్రసిద్ధ్ కృష్ణ (రాజస్థాన్), బెయిర్స్టో (పంజాబ్), బుమ్రా, రిచర్డ్సన్(ముంబయి), పంత్ (దిల్లీ), జేమీసన్, ముఖేష్ చౌదరి (చెన్నై) ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయారు. ఇక రజత్ పటీదార్, హేజిల్వుడ్, మ్యాక్స్వెల్(ఆర్సీబీ), లివింగ్స్టోన్(పంజాబ్), మోసిన్ ఖాన్(లఖ్నవూ), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా) కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నారు. మరోవైపు జాతీయ జట్ల తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్కు చెందిన కొంతమంది ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా సీజన్లో అడుగుపెట్టనున్నారు.

రాత మారుస్తారా?
ఈ సీజన్లో నాలుగు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలో దిగుతున్నాయి. దిల్లీకి వార్నర్, పంజాబ్కు ధావన్, సన్రైజర్స్కు మార్క్రమ్, కోల్కతాకు నితీష్రాణా నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో దిల్లీ, పంజాబ్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. ఒకసారి సన్రైజర్స్ (2016), రెండుసార్లు కోల్కతా (2012, 2014) టైటిళ్లు దక్కించుకున్నాయి. ఈ జట్లను నడిపించడం కెప్టెన్లకు సవాలే. వార్నర్, ధావన్కు ఇప్పటికే ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. సన్రైజర్స్కు వార్నర్ కప్పు అందించగా.. గతంలో కొన్ని మ్యాచ్ల్లో సన్రైజర్స్, దిల్లీ, పంజాబ్ను ధావన్ నడిపించాడు. నిరుడు పంజాబ్కు మయాంక్ సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిరుడు లీగ్లో అడుగుపెట్టిన లఖ్నవూ కూడా టైటిల్పై కన్నేసింది. కృనాల్ పాండ్య, దీపక్ హుడా, మార్క్వుడ్, నికోలస్ పూరన్ లాంటి ఆటగాళ్లతో బలంగానే కనిపిస్తున్న ఆ జట్టుకు.. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోవడం కీలకం కానుంది.
రోహిత్కు అనారోగ్యం..
గురువారం ఐపీఎల్ జట్ల కెప్టెన్లందరూ కలిసి ట్రోఫీతో ఫొటో దిగారు. కానీ అందులో ముంబయి సారథి రోహిత్ శర్మ లేకపోవడం చర్చకు దారితీసింది. అనారోగ్యం కారణంగా రోహిత్ అహ్మదాబాద్ వెళ్లలేదని, ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్ వరకూ కోలుకుంటాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్క్రమ్ ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉండడంతో సన్రైజర్స్ తరపున భువీ పాల్గొన్నాడు.
ఆ రెండు జట్లు ఏం చేస్తాయో?
ఐపీఎల్లో ముంబయి 5 సార్లు, చెన్నై 4 సార్లు టైటిల్ సొంతం చేసుకున్నాయి. కానీ నిరుడు ఈ రెండు జట్లూ అనూహ్యంగా పేలవ ప్రదర్శనతో పట్టికలో చివరి రెండు స్థానాల్లో (ముంబయి 10, చెన్నై 9) నిలిచాయి. ఈ సారి ఈ అగ్రశ్రేణి జట్లు తిరిగి పుంజుకుని.. సీజన్ను రసవత్తరంగా మారుస్తాయనే అంచనాలున్నాయి. ముఖ్యంగా టైటిళ్ల సంఖ్యలో ముంబయిని అందుకోవాలనే పట్టుదలతో చెన్నై ఉంది. ఇక నిరుటి ప్రదర్శన తర్వాత రోహిత్పై ఒత్తిడి పెరిగింది. ఇటు అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సీజన్ రోహిత్కు పరీక్షే. చెన్నై.. ముంబయిని అందుకుంటుందా..? ముంబయి ఆరో టైటిల్ దక్కించుకుంటుందా? లేదా ఈ రెండు జట్లను కాదని మరొకటి విజేతగా నిలుస్తుందా? అన్నది మే 28న తేలిపోతుంది.