Homeజాతీయ వార్తలుHuzurabad By-Election 2021: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేదెవరో తెలిసిపోయింది!

Huzurabad By-Election 2021: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేదెవరో తెలిసిపోయింది!

Huzurabad By-Election 2021: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలోని బద్వేలు బరి నుంచి టీడీపీ, జనసేన తప్పుకోవడంతో ప్రత్యర్థులు లేక ఆ ఎన్నిక చప్పగా మారింది. కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్నా లేనట్టే. తెలంగాణలో మాత్రం తనను వ్యతిరేకించి బయటకొచ్చిన ఈటలను ఓడించాలని కేసీఆర్  పంతం పట్టారు. ఇక్కడ టీఆర్ఎస్ అధికార బలం గెలుస్తుందా? ఈటల పంతం నెరవేరుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.

హుజూరాబాద్ లో నామినేషన్లు పూర్తి కావడంతో అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలు రచ్చిస్తున్నారు. గెలుపు కోసం దసరా పండుగ వేళ మందు, విందులు ధావత్ లతో టీఆర్ఎస్ నేతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈటల రాజేందర్ తన సొంత ఛరిష్మాతో ముందుకెళుతుండగా.. టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధిని ముందుపెట్టి రాజకీయం చేస్తోంది.

తెలంగాణలోనే అతిపెద్ద పండుగైన దసరా, బతుకమ్మ పండుగ ఎన్నికల వేళ రావడంతో పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఈ పండుగను వాడుకుంటున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు.

ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ను ఎదురించి ప్రస్తుతం బీజేపీ నుంచి పోటికి దిగారు. అయితే ఆయన బీజేపీని పేరు వాడకుండా తన సొంత చరిష్మాతోనే హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే గత హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఇక్కడ కేవలం 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీకి అస్సలు బలం లేదు. అందుకే బీజేపీ నుంచి పోటీచేయడం వల్ల ఆయన పార్టీ బలంతో కాకుండా సొంత చరిష్మాను నమ్ముకొని ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ఫక్తు అభివృద్ధి మంత్రంతో డబ్బులు కుమ్మరించి ఓటర్లను పథకాలు, పనులతో తమవైపు తిప్పుకుంటోంది. సంక్షేమమే తనను గెలిపిస్తుందని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నమ్ముతున్నారు. మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఎత్తులు వేస్తూ గెలుపు బాధ్యతను భుజానా వేసుకున్నారు. ఈటల అనుచరులను నయానో భయానో తన వైపు లాగేస్తున్నారు. దళితబంధును పెద్ద ఎత్తున పంచుతూ ఎస్సీలను ఆకర్షిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి మంత్రి, గ్రామాలకు ఎమ్మెల్యేలు, నాయకులు బాధ్యత తీసుకొని గడపగడపకు ప్రచారం చేస్తూ కుల సంఘాలను మచ్చిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సైతం తన అదృష్టాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ అండతో పరీక్షించుకుంటున్నారు. స్థానికేతరుడైన ఈ విద్యార్థి ఉద్యమ నాయకుడు వెంకట్ కు ఇక్కడి నేతలు సహకరించడం లేదన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు పట్టించుకోకపోవడంతో చప్పగా సాగుతోందని తెలుస్తోంది. 2018లో కౌశిక్ రెడ్డి సాయంతో ఈటలకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడిక్కడ నామమాత్రంగా తయారైంది.

ప్రధానంగా చూస్తే టీఆర్ఎస్ ఎంత డబ్బు పంచినా కూడా తీసుకుంటూ ఈటల పట్ల నియోజకవర్గ ప్రజలు సానుభూతి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ తాజాగా నిర్వహిస్తున్న సర్వేలు, ప్రజాభిప్రాయాల్లో ఈటలదే విజయం అని ఘంఠాపథంగా చెబుతున్నారు. విశేషం ఏంటంటే టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేస్తున్న వారిలో కూడా ఈటలే గెలవాలని ఉందన్న టాక్ నడుస్తోంది. ఈవెన్ హరీష్ రావు సైతం అదే అభిప్రాయంతో ఉన్నారని ప్రతిపక్ష నేతలు కూడా చెబుతున్నారు. సో  హుజూరాబాద్ లో ఈటల గెలుపు గ్యారెంటీ అని.. అయితే టీఆర్ఎస్ తీవ్రంగా పోటీనిస్తుందని.. గెలుపు కేవలం వందల ఓట్ల తేడానే అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version