Gujarat High Court: మానవ సంబంధాలన్నీ యాత్రికం, తాత్కాలికం, అవసరం మేరకు అన్నట్లు మారుతున్న ఈ రోజుల్లో అనురాగం, ఆప్యాయత, ప్రేమ దూరమవుతున్నాయి. తల్లీ బిడ్డ, అన్నా చెల్లి, ప్రియుడు, ప్రియురాలు, భార్యభర్త.. ఇలా అన్ని సంబంధాల మధ్య ఈ రోజుల్లో అవసరమే కనిపిస్తోంది. అక్కర మేరకే అనుబంధాలను ప్రదర్శిస్తున్నారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓ భర్త తన సంసార సుఖాన్ని పునరుద్ధరించాలని కోర్టును ఆశ్రయించాడు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవం. సంసార సుఖం పొందలేకపోతున్నానని, పునద్ధరించేలా తన భార్యను ఆదేశించాలని గుజరాత్ కోర్టులో పిటిషన్ వేశాడు.
వారాంతపు దాంపత్యం..
నెలలో రెండుసార్లు భర్తతో ఉండడం వలన తన దాంపత్య బాధ్యతలు నెరవేరుతాయో లేదో తేల్చాలని ఓ మహిళా ఉద్యోగి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో తన భార్య తనతో రోజూ జీవించడం లేదని భర్త సూరత్లోని ఫ్యామిలీ కోర్టును గతేడాది ఆశ్రయించాడు. తన భార్య నెలలో రెండు, నాలుగో వారాంతాల్లో మాత్రమే తనతో ఉంటుందని, మిగతా రోజులు తన పుట్టింట్లో ఉంటుంది పిటిషన్లో పేర్కొన్నాడు. తన భార్య తనతో రోజూ జీవించేలా ఆదేశాలు ఇవ్వాలని, దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9ని ప్రయోగించాలని విన్నవించాడు.
హైకోర్టుకు వెళ్లిన భార్య..
ఇక తనపై తన భర్త వేసిన దావాను సవాల్ చేస్తూ ఉద్యోగి అయిన భార్య ఈనెల మొదట్లో హైకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా ఫ్యామిటీ కోర్టులో విచారణ సందర్భంగా భర్త కొన్ని విషయాలు కోర్టుకు వెల్లడించారు. తన భార్య కుమారుడి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉద్యోగాన్ని కొనసాగిస్తోందని, తనకు దాంపత్య హక్కులు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అతని భార్య సివిల్ ప్రొసీజర్ కోడ్లోని రూల్ 7 ఆర్డర్ 11 ప్రకారం కుటుంబ న్యాయస్థానంలో ఒక దరఖాస్తును దాఖలు చేసింది. భర్త యొక్క దావాను నిర్వహించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. ప్రతీ నెల రెండు వారాంతాల్లో తాను మ్యాట్రిమోనియల్ హోమ్కు క్రమం తప్పకుండా వెళ్తుంటానని, భర్త తనను విడిచిపెట్టాడని, అతనితో కలిసి జీవించేలా ఆదేశాలు ఇవ్వాలని తన భర్త చేసిన వాదన తప్పు అని ఆమె అన్నారు.
భార్య అభ్యంతరం తిరస్కరణ..
విచారణ అనంతరం సెప్టెంబర్ 25న సూరత్లోని కుటుంబ న్యాయస్థానం భార్య అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. క్లెయిమ్లపై పూర్తి స్థాయి విచారణ అవసరమని, విచారణకు ముందు దశలో సమస్యను పరిష్కరించలేమని చెప్పింది. దీంతో మహిళ తరఫు న్యాయవాది వాదిస్తూ, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి యొక్క సమాజం నుంచి వైదొలిగినట్లయితే, ఒక వ్యక్తి వైవాహిక బాధ్యతలను నెరవేర్చడానికి నిర్దేశించవచ్చని కోరారు. ఈ సందర్భంలో, భార్య ప్రతీ రెండవ వారాంతంలో తన మ్యాట్రిమోనియల్ హోమ్ను సందర్శిస్తుందని, అందువల్ల ఆమె వైవాహిక జీవితం నుంచి వైదొలిగినట్లు భర్త క్లెయిమ్ చేయలేరని వాదించారు.
స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ వీడీ.నానావతి ‘భర్త తన భార్యను వచ్చి తనతో ఉండమని కోరితే తప్పేంటి? దావా వేసే హక్కు అతనికి లేదా?‘ అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని, జనవరి 25లోగా స్పందించాలని భర్తను న్యాయమూర్తి సూచించారు.
ఈ కేసును పరిశీలించాక. కాపురం చేయమని కూడా కోర్టులను ఆశ్రయించడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులకు ఇక ఏం పనిలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలకు కూడా కోర్టుకు ఎక్కడం విచిత్రంగా ఉందంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More