
Telangana And AP Early Elections: ప్రజాదరణ కోల్పోతున్న పార్టీ నష్ట నివారణ చర్యలు ఎంత త్వరగా చేపడితే అంత మంచిది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇప్పుడిదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే అధికార వైసీపీకి అంత నష్టం జరుగుతుంది.. అదే సమయంలో విపక్షాలు బలం పెంచుకుంటాయి. అందుకే సీఎం జగన్ వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుననట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణతో వెళ్లాలని..
ఏపీలో ఆర్థిక పరిస్థితులు అక్టోబర్, నవంబర్ నాటికి తీవ్రంగా మారిపోతాయి. ఈ ఏడాది అప్పుల పరిమితి మొత్తాన్ని మూడు, నాలుగు నెలల్లో వాడేసుకుని పంచాల్సినదంతా పంచేసి ఎన్నికలకు వెళ్తే.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అసంతృప్తి ఉండదని వైసీపీ అధినేత నమ్ముతున్నారు. గతంలోనే అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణతోపాటు జరగాలని కోరుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా వచ్చినా దానికి తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అనుకూలమైన పోలీసు అధికారులందర్నీ కీలక స్థానాల్లో నియమించేసింది.

రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే..
కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. ఎన్నికల సన్నాహాలు మాత్రం ఆపలేదు. మరో ఏడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆర్థిక సమస్యలే కాకుండా పార్లమెంట్తోపాటు ఎన్నికలు జరిగితే పరిస్థితులు మారిపోతాయని.. అంచనా వేస్తున్నారు. అందుకే అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఇది మాత్రం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారు. మొత్తంగా మరో ఏడు నెలల్లో ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.