Tree Plantation Benefits: ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి వెళ్లాలంటే భయమేస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే చాలు రోడ్లమీద అనధికారిక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడుతోంది. ఇంట్లో ఉంటే కూడా విపరీతమైన ఉక్క పోత వేధిస్తోంది. ఫ్యాన్ కింద ఉంటే చెమటలు తగ్గడం లేదు. కూలర్ వేడి నుంచి ఉపశమనం అందించడం లేదు. చివరికి ఏసీ కూడా చల్లని గాలిని అందివ్వడం లేదు.
ఇలాంటి తరుణంలో వేసవి నుంచి రక్షణ పొందే ఏకైక మార్గం ఒకటి ఉంది.. అదే మొక్కలను పెంచడం. అభివృద్ధి మాయలో పడి ప్రభుత్వాలు చెట్లను విపరీతంగా నరికేస్తున్నాయి. ప్రజలు కూడా పర్యావరణ స్పృహను పక్కనపెట్టి.. బిల్డింగ్ల మీద బిల్డింగ్ లు కడుతున్నారు. నగరాలు గ్రామాలు అని తేడా లేకుండా కాంక్రీట్ జంగిల్స్ లాగా మార్చేస్తున్నారు. కనీసం వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి గ్రీన్ బెల్ట్ ఏరియాని కూడా కమర్షియల్ గా మార్చేసి.. మొక్కలను పెంచడం లేదు. చెట్లుగా ఎదిగేలా చేయడం లేదు.
ఎండాకాలంలో చల్లదనం కోసం.. చాలామంది ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కానీ చల్లదనం చెట్ల నుంచి విపరీతంగా వస్తుందని.. నిరూపితమైంది. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో ఒకే చోట.. ఓకే సమయంలో నిర్వహించిన పరిశీలనలో చెట్లకు ఉన్న విలువ అందరికీ అర్థమైంది. అక్కడ రోడ్డుమీద ఉష్ణోగ్రతను పరిశీలిస్తే రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు చూయించింది. అదే సమయంలో చెట్టు నీడలో కేవలం 29 డిగ్రీలు మాత్రమే చూపించింది. అంటే చెట్లు ఉన్న ప్రాంతంలో ఏకంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఎండల నుంచి మనల్ని కాపాడడానికి.. భూమిని చల్లబరిచేందుకు మొక్కలు నాటాల్సిందే. వాటిని వృక్షాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందివ్వాల్సిందే.
చెట్లు పరోపకారులు. మొక్కలు నాటడం వల్ల.. మనుషుల మనుగడకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే భూమ్మీద ఉష్ణోగ్రతను చెట్లు తగ్గిస్తాయి. నేల క్షీణతను తగ్గిస్తాయి. భూగర్భ జల మట్టాన్ని క్రమబద్ధీకరిస్తాయి. చివరికి వరదల నుంచి కాపాడతాయి. కరువు కాటకాలు సోకకుండా అడ్డుపడతాయి.
