Uttarakhand Mystery Village: మనదేశంలో రాముడు లేని గుడి ఉండదు.. హనుమంతుడి కోవెల లేని పల్లె ఉండదు. రాముడు తమ నిత్య జీవితంలో ఒక భాగమైతే.. హనుమంతుడు మన శక్తియుక్తులను బలోపేతం చేస్తాడని ప్రజలు నమ్ముతారు. అందుకే రాముడికి నిత్య పూజలు.. హనుమంతుడికి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుతుంటారు.
ఈశాన్యం నుంచి ఆగ్నేయం దాకా.. నైరుతి నుంచి వాయవ్యం దాకా రాముడికి పూజలు జరుగుతూనే ఉంటాయి. హనుమంతుడికి ఉత్సవాలు సాగుతూనే ఉంటాయి. అయితే మన దేశంలో ఈ రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ హనుమంతుడికి పూజలు జరగవు. కనీసం అక్కడి ప్రజలు హనుమంతుడి ప్రస్తావన కూడా తీసుకురారు. ఒకరకంగా హనుమంతుడిని వారు శత్రువులాగా చూస్తుంటారు..
మన దేశంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ద్రోణగిరి ప్రాంతంలో హనుమంతుడికి పూజలు నిర్వహించరు. దీని వెనుక పెద్ద కథ ఉంది. రామాయణ కాలంలో లక్ష్మణుడు ప్రాణాపాయస్థితిలో ఉంటాడు. ఆ సమయంలో హనుమంతుడు అతడిని కాపాడేందుకు సంజీవని కోసం వస్తుంటాడు. ద్రోణగిరి ప్రాంతంలో ఉన్న సంజీవని పర్వతాన్ని హనుమంతుడు తీసుకెళ్తాడు. ఇక్కడి గ్రామ దేవత అనుమతి లేకుండానే అతడు కొండను తీసుకెళ్లాడు. దీంతో గ్రామదేవతను అవమానించారని.. అందువల్లే తాము హనుమంతుడిని పూజించమని ఇక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. శతాబ్దాలుగా ఇక్కడ భక్తులు హనుమంతుడికి పూజలు చేయడం మానేశారు. పూర్వికులు ఆచారాన్ని ఇక్కడ గ్రామస్తులు కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఈ గ్రామంలో హనుమంతుడికి ఆలయాలు ఉండవు. కనీసం జెండాలు కూడా కనిపించవు.
హనుమ పై మొదట్లో ఇక్కడ ద్వేషం ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ద్వేషం తగ్గిపోయింది. కాకపోతే తమ గ్రామ దేవత అనుమతి లేకుండా హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుపోవడం పట్ల తాము ఆత్మ న్యూనత భావానికి గురి అయినట్టు ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. అందువల్లే హనుమాన్ కు ఆలయాలు నిర్మించలేదని.. కనీసం ఆయన ప్రస్తావన కూడా తీసుకురామని చెబుతుంటారు.