Begunkodor Railway Station Ghost Story: ఇప్పుడు అంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం. రేపు ఏం జరగబోతుందో ఇప్పుడే తెలుసుకోబోతున్నాం. వచ్చే పది సంవత్సరాల కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడే అంచనా వేయగలుగుతున్నాం. ఒకరకంగా మన జీవితాన్ని అత్యంత ఆధునిక శైలిలో నిర్మించుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా అత్యంత ఖచ్చితత్వాన్ని కోరుకుంటున్నాం.
ఇటువంటి కాలంలో మూఢనమ్మకాలకు అవకాశం లేదు. దయ్యాలు, మంత్రాలు, తంత్రాలు వంటి వాటికి ఆస్కారం లేదు. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక ఆడ దయ్యం చుక్కలు చూపించింది. ఏకంగా ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కు వెన్నులో వణుకు పుట్టించింది. ఒకటి కాదు, చాలా కాలం వరకు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ ఆ ప్రస్తావన వస్తేనే గజగజా వణికి పోయేది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెగున్ కోదర్ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ 1967 లో రైల్వే పట్టాల మీద ఆడ దయ్యం తిరుగుతుందని ప్రచారం జరిగింది. అసలు ఆ పుకారు ఎవరు సృష్టించారు కూడా తెలియదు. అయితే ఆ స్టేషన్ మాస్టర్ కుటుంబం ఉన్నట్టుండి చనిపోయింది.. ఆ తర్వాత అటు చుట్టుపక్కల వారు ఆ రైల్వే స్టేషన్ వెళ్లడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ఆడ దయ్యం తిరుగుతుందని.. స్టేషన్ మాస్టర్ కుటుంబాన్ని చంపేసిందని చుట్టుపక్కల వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. స్టేషన్లోకి ఎవరు రాకపోవడం.. అక్కడ పనిచేయడానికి మిగతావారు ముందుకు రాకపోవడంతో రైల్వే శాఖ తట్టుకోలేక ఆ స్టేషన్ మొత్తాన్ని మూసేసింది. దాదాపు 42 సంవత్సరాల పాటు ఆ స్టేషన్లో రైళ్లు ఆగలేదు. రైల్వే స్టేషన్ తెరుచుకోలేదు. చివరికి 2009లో మళ్లీ స్టేషన్ ను ప్రారంభించారు. ఆ స్టేషన్లో రైళ్లు ఆగడం మొదలైంది. అంతేకాదు ప్రయాణికులు కూడా రావడంతో స్టేషన్ పరిసరాలు సందడిగా మారిపోయాయి.
ఈ ఘటన జరిగి సంవత్సరాలు పూర్తి కావడంతో రైల్వే స్టేషన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ విషయం గురించి మర్చిపోయారు. నాటి కాలం వారు ఇప్పుడు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం లేదు. పైగా కాలం కూడా మారిపోవడంతో మూఢనమ్మకాలను ఎవరూ పెద్దగా నమ్మడం లేదు. స్టేషన్ పరిసరాలను మొత్తం అభివృద్ధి చేయడంతో దయ్యంలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు.. ఏది ఏమైనప్పటికీ ఇండియన్ రైల్వే చరిత్రలో ఈ దయ్యం ఎపిసోడ్ హర్రర్ సినిమాను చూపించింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇండియన్ రైల్వే శాఖలో అధికారులు ఈ స్టేషన్ గురించి మాట్లాడినప్పుడు గతం తాలూకు ఉదంతాలను గుర్తు చేసుకుంటారు.
