Jaahnavi Kandula Case
Jaahnavi Kandula Case: అగ్రరాజ్యం అమెరికాలో అహంకార పూరిత పోలీస్ ఉద్యోగం ఊడింది. గతేడాది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్తిని జాహ్నవి కందుల మరణించింది. ఆమె మృతిని చులకనగా చూస్తూ ఎగతాలి చేస్తూ మాట్లాడిన డేనియల్ అడెరెర్ అనే పోలీసును ఉద్యోగంలో నుంచి తొలగించారు. జాహ్నవి మరణంపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా, మనసును గాయపర్చేలా ఉన్నాయని, పోలీస్ ఉన్నతాధికారి సూ రహర్ తెలిపారు. అందుకే ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అడెరెర్ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్కే అవమానమని.. అందుకే తొలగించేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి విషయంలో బాధను ఎవరూ మాన్పలేరని.. అడెరెర్ మాటలు సియాటల్ పోలీసులకే మాయని మచ్చ వెల్లడించారు.
వృత్తికే సిగ్గుచేటు..
జాహ్నవి కందు మరణంపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ వృత్తిగే సిగ్గుచేటని సియాటల్ పోలీస్ చీఫ్ రహర్ పేర్కొన్నారు. పోలీసుల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని.. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అడెరెర్ను విధుల్లో కొనసాగించడం పోలీస్ డిపార్ట్మెంట్కే అగౌరవమని.. అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు తెలిపారు.
గతేడాది జనవరిలో ఘటన..
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన జాహ్నవి కందుల ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరగా.. 2023 జనవరి 23న రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. పైగా పగలబడి నవ్వడంపై విమర్శలు వచ్చాయి. జాహ్నవి మరణాన్ని కించపరిచేలా మాట్లాడటంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘జాహ్నవి సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువ లేదు’ అన్నట్లుగా అడెరెర్ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. భారత యువతి మరణాన్ని అవమానించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కూడా డిమాండ్ సింది.
తప్పించుకునే ప్రయత్నం..
అడెరెర్ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఎందుకు నవ్వాడో కూడా చెప్పకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని వివరణ ఇచ్చాడు. తాను కేవలం కోర్టులో లాయర్ల వాదనల గురించి ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషి ప్రాణం విలువ గురించి లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో తాను గతంలో చూశానని.. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాను బాధితురాలిని అవమానించేలా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తనకు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనన్నారు.
మరణానంతరం డిగ్రీ…
మరోవైపు సియాటల్లో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీని ఇవ్వాలని.. ఆమె చదివిన నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది. కుటుంబ సభ్యులకు ఈ పట్టాను అందజేస్తామని యూనివర్సిటీ తెలిపింది. జాహ్నవి కేసులో.. గతంలోనే పోలీస్ అధికారి అడెరెర్ను సస్పెండ్ చేయగా.. తాగాజా ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.