Australia: విదేశీ విద్యార్థుల వలసలను తగ్గించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును భారీగా పెంచింది. 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉండే వీసా ఫీజును ఇప్పుడు 1600 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.40 వేల నుంచి రూ.89 వేలకు పెరిగింది.
స్టూడెంట్ వీసా దరఖాస్తు నిషేధం..
వీసా ఫీజు పెంచడంతోపాటు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా హోల్డర్లు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు కలిగిన విద్యార్థులు దేశంలో ఉన్నప్పుడు స్టూటెంట్ వీసా కోసం దరఖాస్తు చేయకుండా నిషేధించింది. రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జూలై 1 నుంచి కొత్త ఫీజులు..
ఆస్ట్రేలియా ప్రభుత్వం పెంచిన వీసా ఫీజులను జూలై 1 నుంచి అమలు చేయనుంది. అమలులోకి వస్తున్న మార్పులను మన అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. స్వేచ్ఛగా ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా మైగ్రేషన్ వ్యవస్థను సృష్టిస్తామని కేంద్ర హోం వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నీల్ పేర్కొన్నారు.
ఇప్పటికే ఫీజులు పెంచిన అమెరికా, కెనడా..
విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులు ప్రారంభంలో అమెరికా, కెనడా వెళ్లేవారు. ఆ రెండు దేశాలు వీసా ఫీజులను భారీగా పెంచాయి. అమెరికా 185 డాలర్లు, కెనడా 110 డాలర్లు పెంచడంతో విద్యార్థులు ప్రయత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు. దీంతో సుమారు 30 శాతం మంది ఆస్ట్రేలియా బాట పట్టారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఫీజులు భారీగా పెంచేసింది.
గతేడాది 1.50 లక్షల మంది ఆస్ట్రేలియాకు..
కొన్ని గణాంకాల ప్రకారం విదేశీ విద్య కోసం 2022–23 సంవత్సరంలో భారత్ నుంచి 1.50 లక్షల మంది అమెరికా వెళ్లారు. విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడానికి 2022 చివరలో విదేశీ విద్యార్థుల వీసా ఫీజుల పాలసీలో మార్పులు చేసింది అక్కడి ప్రభుత్వం. దీంతో నియమాలు కఠినం అయ్యాయి. ప్రారంభంలో ఇంగ్లిష్ భాష అవసరాన్ని మరింత కఠినతరం చేశారు. ఆ తర్వాత వీసా ఫీజులు పెంచింది.