Russia: రష్యాలో ఘోరం.. నదిలో మునిగి నలుగురు భారతీయ మెడికోలు మృతి

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని యరోస్లోవ్‌ ది వైస్‌ నోవోగొరోడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు జూన్‌ 5న తమకు సమీపంలోని వోల్ఖోవ్‌ నది ఒడ్డున వాకింగ్‌కు వెళ్లారు.

Written By: Raj Shekar, Updated On : June 7, 2024 5:54 pm

Russia

Follow us on

Russia: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల పరంపర కొనసాగుతోంది. కారణం ఏదైనా మరణాలు మాత్రం భారతీయ విద్యార్థులనే కబళిస్తున్నాయి. తాజాగా రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. సెయింట్‌ పీటర్స్‌బర్‌ ప్రాంతంలోని ఓ నదిలో మునిగి నలుగురూ మృతిచెందారు. ఒక విద్యార్థి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

ఏం జరిగింది..
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని యరోస్లోవ్‌ ది వైస్‌ నోవోగొరోడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు జూన్‌ 5న తమకు సమీపంలోని వోల్ఖోవ్‌ నది ఒడ్డున వాకింగ్‌కు వెళ్లారు. వారు నడుస్తుండగా ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు నీటిలో జారిపడింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. విద్యార్థినిని స్థానికులు కాపాడారు.

రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు..
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో ఓ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మృతులను హర్షల్‌ అనంంత్‌రావ్, జీషన్‌ పింజారీ, జియా పింజారి, మాలిక్‌ మహమ్మద్‌ యాకూబ్‌గా గుర్తించారు. వీరిలో జీషన్, జియా హర్షల్‌ది మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లా. ఆ జిల్లా కలెక్టర్‌ ఆయుష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థుల మృతిని «ధ్రువీకరించారు. వారి మృతదేహాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని భారత దౌత్య కార్యాలయం స్పందించింది. ఇది దురదృష్టకర ఘటన అని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపింది.