
మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. తేదీని ఖరారు చేసుకొని రైతులు చర్చలకు రావాలన్నారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామంటూ కేంద్రం పదేపదే చెబుతుండటం ఆపాలని, అది అర్ధరహితంగా ఉందని రైతు సంఘాల నేతలు బుధవారం అన్నారు. కేంద్రం ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను తిరస్కరించిన విషయం తెలిసిందే.