Ayodhya Ram Mandir : అయోధ్యలో అపూర్వ గట్టం ఆవిష్కృతమైంది. మరో ఐదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున వేళ బాల రాముడు బుధవారం(జనవరి 17న) భక్తులకు దర్శనమిచ్చాడు. భారీ ఊరేగింపు నడుమ రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్యకు తీసుకు వచ్చిన రామజన్మభూమి తీర్థట్రస్టు.. నమూనా విగ్రహంతో అయోధ్యలో శోభాయాత్ర నిర్వహించారు.
నమూనా విగ్రహమే..
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ శిల్పి అరుణ్యోగిరాజ్ తయారు చేసిన బాలరాముడి విగ్రహాన్ని రామాలయంలో ప్రతిష్టాపనకు ఎంపిక చేశారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆ విగ్రహాన్ని జనవరి 17న అయోధ్యకు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహంతో శోభాయాత్ర ఉంటుందని ముందుగా ప్రకటించారు. కానీ సాయంత్రం స్వామివారి నమూనాతో పోలిన వెండి విగ్రహంతో అయోధ్య వీధుల్లో బుధవారం శోభాయాత్ర నిర్వహించారు.
పులకించిన భక్త జనం..
అయోధ్య బాలరాముడి దర్శనం బుధవారం జరుగుతుందని అయోధ్య వాసులతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకున్న రామ భక్తులు భావించారు. కానీ చివరి నిమిషంలో రామ్ లల్లా విగ్రహానికి బదులు.. వెండితో చేసిన విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. అయినా భక్తులు నమూనా విగ్రహాన్ని చూసి పులకించిపోయారు. మంగళ హారతులతో రామ్లల్లా నమూనా విగ్రహానికి స్వాగతం పలికి దర్శించుకుని పూజలు చేశారు.
ఐదేళ్ల బాలుడిగా..
ఇదిలా ఉండగా బాల రాముడు ఐదేళ్ల బాలుడిగా బుధవారం అయోధ్యలో భక్తులకు దర్శనమిచ్చారు. వెండితో ఐదేళ్ల బాలుడి రూపంలో తయారు చేసిన నమూనా విగ్రహాన్ని మాత్రమే ఊరేగించారు. భారీ ర్యాలీగా రామాలయంలోకి తీసుకువచ్చారు. అయితే అసలైన రామ్లల్లా ఎలా ఉంటాడో ఇప్పటికీ రామజన్మభూమి తీర్థ ట్రస్టు విడుదల చేయకపోవడం గమనార్హం.
Uttar Pradesh | Ramlalla’s representative idol was carried across the Ram Temple premises in Ayodhya earlier today.
(Pics: VHP spokesperson Sharad Sharma) pic.twitter.com/4M07BjV1yc
— ANI (@ANI) January 17, 2024