Google Phones In India: మేక్‌ ఇన్‌ ఇండియా: భారత్‌లో గూగుల్‌ ఫోన్ల తయారీ.. 2024 నుంచి అందుబాటులోకి..

గూగుల్‌ ఇటీవలే తన పిక్సెల్‌ స్మార్ట్‌ ఫోన్లను ఆవిష్కరించింది. పక్షం రోజులకే ఈ ఫోన్లను భారత్‌లోనూ తయారు చేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

Written By: Sekhar Katiki, Updated On : October 19, 2023 5:07 pm

Google Phones In India

Follow us on

Google Phones In India: అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజాలు ఒక్కొక్కటిగా భారత దేశానికి తమ ఉత్పత్తిని మారుస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌ కంపెనీ ముంబైలో ఈఏడాది నుంచే ఐఫోన్ల తయారీ ప్రారంభించింది. స్మార్ట్‌ ఫోన్ల తయారీలో యాపిల్‌తో పోటీ పడుతున్న గూగుల్‌ సంస్థ తాజాగా తన పిక్సెల్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీనికి కొంత మేర భారత్‌కు తరలించాలని గూగుల్‌ నిర్ణయించింది. ఆపిల్‌ భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్‌ ఉత్పత్తులను స్థానికంగా పెంచుతుండడంతో గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గ్లోబ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా భారత్‌ మారాలనే ఆశయానికి ఊపునిచ్చేలా గూగుల్‌ నిర్ణయం తీసుకుంది. తన పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీని ఇండియాలో మ్యాను ఫాక్చర్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

ఆవిష్కరించిన పక్షానికే..
గూగుల్‌ ఇటీవలే తన పిక్సెల్‌ స్మార్ట్‌ ఫోన్లను ఆవిష్కరించింది. పక్షం రోజులకే ఈ ఫోన్లను భారత్‌లోనూ తయారు చేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. పిక్సెల్‌ 8 ఫోన్లను ఇండియాలో తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మొదటి డిషన్‌ 2024లో మార్కెట్‌లోకి వస్తాయని అంచనా వేసింది. ఈమేరకు దేశీయ, అంతర్జాతీయ తయారీదారులతో కలిసి పనిచేయాలని గూగుల్‌ నిర్ణయించింది.

భారత్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో..
భారత్‌ అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఇప్పటికే ఐఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ రికార్డు స్థాయిలో ఉత్పత్తిని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే అవకాశాన్ని వినియోగించుకోవాలని గూగుల్‌ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా లావా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపింది. వీటి ద్వారా తయారీని ఇండియాకు మార్చాలని టెక్‌ దిగ్గజం తాజాగా నిర్ణయించింది.

చైనాను వీడుతున్న బడా కంపెనీలు..
ఇదిలా ఉంటే.. చైనాలో కఠినమైన కోవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం వంటి కారణాలతో అప్రమత్తమైన బడా కంపెనీలు, టెక్‌ దిగ్గజాలు భారత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. చైనాలోని తమ తయారీ ప్లాంట్లను ఇండియాకు షిఫ్ట్‌ చేస్తున్నాయి. గతనెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ కాలిఫోర్నియాలో గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో సీఈవో సుందర్‌ పిచాయ్‌ని కలిసిన తర్వాత తాజా ప్రకటన వచ్చింది. చైనా, వియత్నాంలో 9 పిక్సెల్‌ స్మార్ట్‌ ఫోన్లను తయారు చేస్తున్న గూగుల్‌ తాజాగా అక్కడి తయారీ సంస్థలను ఇండియాకు షిఫ్ట్‌ చేయనున్నట్లు సమాచారం.