దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజు వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే వేలసంఖ్యలో కొత్తకేసులు పుట్టుకొచ్చాయి. కరోనా బారిన పడి అనేక రాష్ర్టాలు అతలాకుతలం అవుతున్నాయి. కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్కును దాటగా.. వారం రోజుల వ్యవధిలోనే లక్షన్నరను అధిగమించాయి. దీంతో దాన్ని వేగం ఎలా ఉందో అర్థం అవుతోంది.
మహారాష్ట్రాలో వారంలో మూడురోజుల లాక్ డౌన్ మినహా మిగితా ఎక్కడా ఆ పరిస్థితులు లేవు. రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 1,52,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లక్షన్నకు పైగా రోజూవారి కేసులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి.కరోనా వైరస్ ప్రారంభం అయిన తరువాత ఈ ఏడాదికాలంలో ఎప్పుడూ లేనంతగా.. ఈ స్థాయిలో కొత్తకేసులు వెలుగు చూస్తున్నాయి. సెకండ్ వెవ్ లో కళ్లు తిరిగే వేగంతో కేసులు పరుగు పెడుతున్నాయి. కొత్తగా 90,584 మంది ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కు చేరుకుంది. ఇందులో 1,20,81,443 మంది డిశ్చార్జ్ కాగా.. 1,69,275 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 11,08,087కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 10,15,95,147 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవంక- కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. 25,66,26,850 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 14,12,047 టెస్టింగులను చేపట్టినట్లు తెలిపింది.
దేశంలో నమోదవుతోన్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో సెకెండ్ వేవ్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం ఒక్కరోజే 55,411 కేసులు నమోదయ్యాయి. 309 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసులు 33,43,951 కాగా.. ఇందులో 27,48,153 మంది డిశ్చార్జ్ అయ్యారు. 57,638 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 5,36,682గా రికార్డయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.