Karnataka CM post : కౌన్ బనేగా సీఎం.. మల్లికార్జుననే కింగ్ మేకర్

కర్ణాటకలో విజయం తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ ఇంకా సమాధానం ఇవ్వడం లేదు. అయితే దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Written By: K.R, Updated On : May 15, 2023 8:52 am

Karnataka Chief Minister Siddaramaiah

Follow us on

Karnataka CM post : ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెతకు నిజమైన అర్థం ఇదే కావచ్చు. మొన్నటిదాకా వరుస ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక రాష్ట్రంలో విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు కొత్త బలాన్ని ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఆయన ఇంటిని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని జన సందోహంతో ముంచెత్తింది. విజయం అనేది ఎవరికైనా సరే ఇలాంటి కిక్ ఇస్తుంది. ప్రస్తుతం ఆ ఆనందాన్ని కాంగ్రెస్ పార్టీ తనివి తీరా ఆస్వాదిస్తోంది.

ఎవరవుతారు?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రధానంగా చర్చకు వచ్చిన ప్రశ్న ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారని? దీనిపై ఎటువంటి ప్రకటన చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. అయితే ఎన్నికల్లో తమకు ఇది ప్రతికూలంగా మారుతుందని కొంతమంది నేతలు అన్నప్పటికీ దానిని అధిష్టానం పట్టించుకోలేదు. అయితే కర్ణాటకలో విజయం తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ ఇంకా సమాధానం ఇవ్వడం లేదు. అయితే దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శనివారం ఫలితాలు వెళ్లడైన నాటి నుంచి ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకు మల్లికార్జున ఇల్లు వచ్చి పోయే నేతలతో సందడిగా మారింది. అయితే ఓ వర్గం నేతలు శివకుమార్ కు అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందని చెబుతున్నారు. మరోవైపు కొంతమంది నాయకులు అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి స్థానాన్ని అప్పగిస్తారని వివరిస్తున్నారు..

ఆదుకుంది శివకుమార్

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి కర్ణాటకలో తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన శివకుమార్ బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేశారు. తనకు విరుద్ధమైన భావజాలం ఉన్న వ్యక్తి ఆయన సిద్ధరామయ్యతో కలిసి పని చేశారు. అభ్యర్థులకు ఖర్చు మొత్తం తానే భరించారు. చివరికి కనివిని ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకొచ్చారు. అయితే ఇన్ని అనుకూలతలు ఉన్న నేపథ్యంలో శివకుమార్ కు ముఖ్యమంత్రి స్థానం అప్పగిస్తారని చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి స్థానం అప్పగించే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. సిద్ధరామయ్య హయాంలో కర్ణాటక రాష్ట్రం ప్రగతిని సాధించింది. ఐదు సంవత్సరాలు విజయవంతంగా కర్ణాటక రాష్ట్రాన్ని పాలించారు. సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టమైన నాయకుడు కావడంతో ఆయనకు ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకపోవడంతో, దీనికి సంబంధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.