కర్ణాటకలో రాసలీలల సీడీ ఎంతలా సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు బాధిత యువతి అజ్ఞాతం వీడింది. మంగళవారం బెంగళూరులోని మేజిస్ట్రేట్లో బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. బుధవారం సిట్ అధికారులు ఆమెను విచారించారు. విచారణలో భాగంగా ఆమె కీలక విషయాలు వెల్లడించింది. విచారణలో బాధిత యువతికి సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ మంత్రి రమేష్ జర్కిహోళితో పరిచయం.. ఇద్దరి మధ్య అసలేం జరిగింది.. ఆయన వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురైంది వంటి ప్రశ్నలను సంధించారు.
అందుకు బాధితురాలు చెప్పిన సమాధానాలను రికార్డ్ చేశారు. ‘కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం కోసం మొదటిసారి విధానసౌధకు వెళ్లినప్పుడు మంత్రి జర్కిహోళిని కలిశాను. ఆ సమయంలో ఆయన తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చారు. మల్లేశ్వరం పీజీ అని సేవ్ చేసుకోమన్నారు. ఆ నంబర్ మరెవరికీ ఇవ్వొద్దన్నారు. కొద్దిరోజులకు.. శారీరకంగా తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చారు. రెండు, మూడుసార్లు ఫ్లాట్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. సీనియర్ మంత్రి కావడంతో ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేక భయపడి మౌనంగా ఉండిపోయాను’ అని బాధిత యువతి సిట్ అధికారులకు వెల్లడించింది.
‘నాపై జరిగిన లైంగిక దాడిని అమ్మతోపాటు ఎవరికీ చెప్పుకోలేదు. ఈ విషయాన్ని ఎలా చెప్పుకోగలను. అత్యాచారానికి పాల్పడిన సమయంలో జర్కిహోళి వీడియో కూడా తీశారు. దాన్ని అతని వద్దే పెట్టుకుని పిలిచినప్పుడల్లా రావాలని బెదిరించారు. దీంతో ఆయనకు భయపడి వెళ్లాల్సి వచ్చింది. జర్కిహోళి నన్ను అసభ్య పదజాలంతో తిట్టేవారు. అతని ప్రవర్తన రోజురోజుకూ నన్ను తీవ్రంగా ఇబ్బందిపెడుతుండటంతో కాలేజీలో నా కొలిగ్ శ్రవణ్కి విషయం చెప్పాను’ అని ఆమె వెల్లడించింది.
‘శ్రవణ్ ద్వారా నరేశ్ పరిచయమయ్యారు. సాక్ష్యాధారాలు లేకుండా మంత్రిపై కేసు పెట్టలేమని చెప్పారు. దీంతో మరోసారి మంత్రి వద్దకు వెళ్లినప్పుడు నేను కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఒక కాపీ నా వద్ద పెట్టుకుని.. మరో కాపీని నరేష్కు ఇచ్చాను. అయితే.. వీడియో ఎవరు లీక్ చేశారో నాకు తెలియదు’ అని సిట్ విచారణలో బాధితురాలు వెల్లడించినట్లు సమాచారం. విచారణ అనంతరం బుధవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ బాధితురాలిని అజ్ఞాత స్థలానికి తరలించారు.