రానున్న రోజుల్లో టెలికాం రంగంలో అద్భుతం చూడబోతున్నాం. టెక్నాలజీ మరింత డెవలప్ కానుంది. 5జీ ఎంట్రీతో దునియా మొత్తం మారిపోనుంది. 4జీ సేవల వల్ల ఎలాంటి సౌలభ్యం లభిస్తుందో కళ్లారా చూస్తున్నాం. 5జీ ఎంట్రీతో అంతా మారిపోనుంది. మొబైల్లో అత్యంత వేగంగా డేటా ట్రాన్స్ఫర్కు వీలు కల్పిస్తోంది 4జీ. ఇక 5జీ వస్తే.. మర్ని అద్భుతాలు జరగడం ఖాయం అంటున్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019లో.. స్వీడన్కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ 5జీ లైవ్ వీడియో కాల్ను తొలిసారిగా భారత్లో ప్రదర్శించింది. భారత్లో తొలి 5జీ వీడియో కాల్ అని, క్వాల్కామ్ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్ హెడ్(సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్లు మిల్లీమీటర్వేవ్ (ఎమ్ఎమ్వేవ్-28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్ స్పెక్ట్రమ్ బాండ్స్) స్పెక్ట్రమ్ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్ నెట్వర్క్స్కు ఎమ్ఎమ్వేవ్ స్పెక్ట్రమ్ కీలకమైందని అన్నారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్ వంటి తాజా టెక్నాలజీలకు 5జీ కీలకం కానుందని మిర్టిల్లో చెప్పారు. 5జీ కారణంగా భారత్లో కొత్త అవకాశాలు వస్తాయన్నారు. 2020 నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాడియా తెలిపారు. ఇంటర్నెట్ స్పీడ్ అధికంగా ఉండే 5జీ సర్వీస్లు భారత్లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
* ముప్పు తప్పదని ఎక్స్పర్ట్స్ వార్నింగ్
సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్న కొత్త కొత్త డెవలప్మెంట్స్ రెండు వైపులా పదునైన కత్తిలాంటివి. వాడే తీరును బట్టి రిజల్ట్ ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకి వాడితే చెడు! ఈ విషయంలో మొబైల్ టెక్నాలజీలు ఏ మాత్రం తీసిపోవు. త్వరలో మనకు అందుబాటులోకి రాబోతున్న 5జీ టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉంటుందో.. ముప్పు అంతకు మించి ఉంటుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. 5జీ సర్వీసెస్కు సపోర్ట్ చేసే మొబైల్స్, 5జీ సిగ్నల్కు ఉండే బలమే దీనికి కారణమంటున్నారు. టెక్నాలజీ డెవలప్మెంట్లో మంచితోపాటు చెడు కూడా ఉంటుంది. ఆ చెడును వీలైనంత తగ్గించినప్పుడు దానికి సార్ధకత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న 5జీ టెక్నాలజీతోనూ కొన్ని ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. చిన్న చిన్న సమస్యలు ఎందులోనైనా ఉంటాయని, 5జీ విషయంలో కాన్స్పిరసీ థియరీలు ఎక్కువగా వస్తున్నాయని, వాస్తవానికి ఈ టెక్నాలజీ వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండబోదని మరికొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే.. ఈ విషయం చర్చకు రావాడానికి కారణం ఇప్పటికే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఫ్రాన్స్లో ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవలే అన్ని ఎయిర్ లైన్స్ కంపెనీలకు, 5జీ ఆపరేటర్లకు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడమే.
* 5జీ సిగ్నల్స్తో ఫ్లైట్స్కు పరేషాన్
‘5జీ నెట్వర్క్కు ఫాస్ట్ కనెక్టివిటీ, ఎక్కువ బ్యాండ్ విడ్త్ ఉండడం వల్ల దీని సిగ్నల్ స్ట్రెంథ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్లైట్స్, హెలికాప్టర్ల సిగ్నల్కు సమానంగా ఉంది. దీని వల్ల వాటికి వెళ్లే సిగ్నల్లో 5జీ చొరబడి కమ్యూనికేషన్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫ్లైట్ ఎగిరే టైమ్లో ఎత్తును తెలియజేసే అల్టీమీటర్ను హైజాక్ చేసే చాన్స్ ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్కు మధ్య కమ్యూనికేషన్ బ్లాక్ అవుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ టైమ్లోనూ ఇబ్బందులు వస్తాయి’ అని ఫ్రెంచ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ హెచ్చరించింది. 5జీ వల్ల తలెత్తే ఇబ్బందులపై పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్ సాయంతో పరిశోధనలు జరుగుతున్నాయని, తాము మళ్లీ చెప్పే వరకు తప్పనిసరిగా ఎయిర్క్రాఫ్ట్లలో 5జీ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసేలా చూడాలని అన్ని ఎయిర్లైన్స్ను ఆదేశించింది.
* ఆన్బోర్డ్ మాస్ట్ ఎక్విప్మెంట్ కాల్స్
విమానాల్లో ప్రయాణికులను వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలని చెప్పడం కొత్తమీకాదు. కానీ.. చాలా ఎయిర్లైన్స్ సంస్థలు విమానాల్లో ఆన్బోర్డ్ మాస్ట్ ఎక్విప్మెంట్ పెట్టి కాల్స్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నాయి. అయితే ఫ్రెంచ్ ఏవియేషన్ అథారిటీ మాత్రం తప్పనిసరిగా తమ గైడ్లైన్స్ ఫాలో కావాలని ఆదేశించింది. 5జీ డివైజ్ల కారణంగా ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్లో ఏ మాత్రం సమస్య తలెత్తినా వెంటనే ఎయిర్ క్రూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇవ్వాలని సూచించింది.
* 5జీ బేస్ స్టేషన్స్ రిస్క్ తగ్గించాలి
5జీ బేస్ స్టేషన్స్ భారీ సంఖ్యలో పెట్టి సిగ్నల్స్ ఎయిర్ ట్రాఫిక్కు సమస్యగా మారకుండా రిస్క్ తగ్గించేలా పని చేయాలని టెలికాం కంపెనీలను ఫ్రెంచ్ ఏవియేషన్ అథారిటీ ఆదేశించింది. 5జీ బేస్ స్టేషన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ స్ట్రెంథ్పైనా గతేడాది నవంబర్ నుంచి టెస్టింగ్ చేస్తున్నట్లు తెలిపింది. 5జీ సిగ్నల్స్ ప్రభావం ఫ్లైట్స్పై ఏ విధంగా పడుతుందనేదానిపై ఇంకా ప్రయోగాలు కొనసాగిస్తున్నామని చెప్పింది.
* కాన్స్పిరసీ థియరీలే..
5జీ టెక్నాలజీపై చాలా కాన్స్పిరసీ థియరీలు వస్తున్నాయని, హెల్త్పైనా తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుందని రూమర్లు వచ్చాయని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ థియరీల్లో అర్థం లేదని అంటున్నారు. అయితే.. గతంలో వచ్చిన టెక్నాలజీలతో పోలిస్తే 5జీ చాలా ఎక్కువ రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీని వాడుకుంటుంది. 3 నుంచి 300 జిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండడం వల్ల 4జీ కన్నా 5జీ నెట్వర్క్ చాలా వేగంగా పని చేస్తుంది. అయితే.. దీనికి చాలా తక్కువ ఏరియాలోనే ఎక్కువ సిగ్నల్ టవర్స్ అవసరమవుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీని వల్లే కాన్స్పిరసీ థియరీలకు అవకాశం పెరిగిందన్నారు. వీటి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కేన్సర్ లాంటి రోగాల రిస్క్ పెరుగుతుందన్న అపోహలు ఎక్కువయ్యాయని, అయితే ఫోన్ వాడడం వల్ల హెల్త్పై తీవ్రమైన ప్రభావమేమీ పడదని డబ్ల్యూహెచ్వో కూడా చెప్పిందంటున్నారు. కానీ.. మొబైల్స్ ఎక్కువగా వాడితే కేన్సర్ వచ్చే ముప్పు ఉందని డాక్టర్ ఫ్రాంక్ డీ వోచ్ తెలిపారు. మరోవైపు 5జీ రాకతో ఎక్స్పోజర్ కొంత పెరుగుతుందని యూకే ప్రభుత్వ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ.. ఈ విషయంలో భయం అక్కర్లేదని, 5జీ సిగ్నల్స్ ద్వారా వచ్చేది నాన్ అయానైజింగ్ రేడియేషనేనని, దీని వల్ల ఏ ప్రమాదం ఉండదని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రొఫెసర్ జాన్ విలియం ఫ్రాంక్ చెప్పారు. రకరకాల ఆపోహలు వస్తుండడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా 5జీ ఆలస్యమవుతోందని ఆయన అన్నారు.
* క్లారిటీ లేకపోవడం వల్లే కాంట్రవర్సీలు
5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎకానమీ పరంగా, లైఫ్స్టైల్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయని ప్రభుత్వాలే చెబుతున్నాయి. ఇండ్లు, ఆఫీస్, స్కూళ్లు ఇలా ప్రతిచోటా వైర్లెస్, మొబైల్ కనెక్టివిటీ విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. కానీ.. సైంటిఫిక్గా దీనికి సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్ల 5జీపై కాంట్రవర్సీలు ఎక్కువయ్యాయని విలియం ఫ్రాంక్ చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, రేడియో వేవ్స్పై లోతైన పరిశోధన జరగాలని, వీటిపై వివరాలను 5జీ ఆపరేటర్లు కూడా క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు.
* 5జీ అడ్వాన్స్మెంట్స్
5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే డేటా, కమ్యూనికేషన్ రంగాల్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తాయి.
4జీ కన్నా 100 రెట్లు వేగంతో 5జీ పని చేస్తుంది. ఆఫీస్ ఇంటర్నెట్తో సమానంగా మొబైల్ డేటా కూడా పని చేస్తుంది. 8 జీబీ ఉండే సినిమా కేవలం ఆరు సెకండ్లలో డౌన్లోడ్ అవుతుంది.
కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు మాట్లాడే వారికి అవసరమైతే రియల్ టైమ్లో ఒకేసారి వేర్వేరు భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేసే టెక్నాలజీ కూడా వస్తుంది.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో 5జీ క్లౌడ్ సాయంతో ఒకేసారి నేవిగేషన్తోపాటు సినిమాల స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు.
* 5జీ వల్ల ఏర్పడే సమస్యలు
* 5జీ సర్వీసెస్ వల్ల డేటా సేఫ్టీ సహా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
డేటా సెక్యూరిటీ కోసం 5జీలో 4జీ కన్నా ఎక్కువగా డేటా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. కానీ అన్ని రకాల డేటా ఎన్క్రిప్షన్ జరగదు. దీని వల్ల ఆ డేటాను 5జీ బేస్ స్టేషన్స్, యాంటీనాస్ యాక్సిస్ చేసే వీలు కుదరడంతో కంపెనీలు డేటాను వాటి ఇష్టానికి వాడుకునే ప్రమాదం ఉంది.
– శ్రీనివాస్ బి
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: The benefits and disadvantages of 5g technology are many
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com