ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. టీమిండియా యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ లు అడ్డంగా నిలబడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఆఖరి టెస్టుపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరించింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 294/7తో పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 89 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ 101 పరుగులు చేసి భారత్ ను పోటీలో నిలబెట్టాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ 60 నాటౌట్ తో అండగా నిలబడడంతో వీరిద్దరూ భారత్ ను గట్టెక్కించారు. ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రస్తుతం క్రీజులో సుందర్ 60 పరుగులతో, అక్షర్ పటేల్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రెండోరోజు వరుసగా పూజారా, విరాట్ కోహ్లీ వికెట్లు కోల్పోయింది. పూజారా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండా డకౌట్(0)కు ఔట్ కావడం అభిమానులకు షాకిచ్చింది. ఈ మధ్యకాలంలో వరుసగా కోహ్లీ విఫలమవుతూ మరోసారి సున్నాకే ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రహానే (27) కూడా తక్కువకే ఔట్ అయ్యాడు. అయితే మరో ఎండ్ లో రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఔట్ అయ్యాడు. పంత్ కు తోడుగా సుందర్ క్రీజులో నిలబడి ఏడో వికెట్ కు 158 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. 115 బంతుల్లోనే పంత్ సెంచరీ చేశాడు. 94 పరుగుల వద్ద సిక్సర్ కొట్టి షాకిచ్చాడు. ఇక ఆ తర్వాత సుందర్ కూడా ఆఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. అతడికి అక్షర్ పటేల్ అండగా నిలిచాడు. మూడోరోజు భారత్ మరో 100 పరుగులు చేస్తే ఇక మ్యాచ్ పై పట్టు బిగిసినట్టే. రేపు కీలకంగా మారనుంది.