అగమ్యగోచరం: ‘గంటా’ దారెటు?

ఆంధ్ర రాజకీయాలలో తనదైన స్టైల్ లో చక్రం తిప్పిన కాపు నాయకుడు ఆయన.. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారపార్టీలోకి మారిపోతూ.. లేదంటే అధికారంలోకి వచ్చే పార్టీని ఊహిస్తూ అందులో చేరి మంత్రి పదవిని అనుభవించిన రాజకీయ మేధావి.. ప్రతిసారి నియోజకవర్గం మారుతూ ప్రజల్లోని వ్యతిరేకతను దాటుకుంటూ జాగ్రత్త పడి గెలుపు గుర్రం ఎక్కిన అపర చాణక్యుడు ఆయన. అయితే ఈసారి మాత్రం ఆయన అంచనా తప్పింది. టీడీపీ ఓడింది. అధికార వైసీపీలోకి చేరాలని చేసిన ఆయన […]

Written By: NARESH, Updated On : January 16, 2021 7:27 pm
Follow us on

ఆంధ్ర రాజకీయాలలో తనదైన స్టైల్ లో చక్రం తిప్పిన కాపు నాయకుడు ఆయన.. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారపార్టీలోకి మారిపోతూ.. లేదంటే అధికారంలోకి వచ్చే పార్టీని ఊహిస్తూ అందులో చేరి మంత్రి పదవిని అనుభవించిన రాజకీయ మేధావి.. ప్రతిసారి నియోజకవర్గం మారుతూ ప్రజల్లోని వ్యతిరేకతను దాటుకుంటూ జాగ్రత్త పడి గెలుపు గుర్రం ఎక్కిన అపర చాణక్యుడు ఆయన. అయితే ఈసారి మాత్రం ఆయన అంచనా తప్పింది. టీడీపీ ఓడింది. అధికార వైసీపీలోకి చేరాలని చేసిన ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను ఏలిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత గంట శ్రీనివాసరావు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది..

Also Read: మోడీ వ్యాక్సిన్.. డప్పు కొట్టుకుంటున్న జగన్

గడిచిన నాలుగైదు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ చేరి మంత్రిగా అధికారం అనుభవిస్తున్న టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అంచనా ఈసారి తప్పింది. గంటా శ్రీనివాసరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీచేసి గెలిచాడు. కానీ పార్టీ మాత్రం ఓడిపోయింది. దీంతో ఈసారి అధికారానికి దూరంగా ఉన్నారు. కానీ దాన్ని భరించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. గంటా టీడీపీలో ఇమడలేక.. వైసీపీలో చేరలేక సతమతమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు గంటా గారి ట్రాక్ రికార్డ్ చూసి ఏకంగా జనసేన నో చెప్పిందని.. బీజేపీ తలుపులు మూసిందని ప్రచారం సాగుతోంది.. వైసీపీలోకి చివరిక్షణంలో చేరిక ఆగిపోయిందని తెలుస్తోంది.

గంటా శ్రీనివాసరావు విశాఖలో మొదట్లో ఓ చిరుద్యోగి. ఆయన మీడియా సంస్థలోనూ పనిచేశారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి దిగారు. ప్రత్యూష పేరిట ఒక సంస్థను ప్రారంభించి తొలి అడుగులు వేశారు. ఇదంతా 30 ఏళ్ల క్రితం మాట. ఆ తర్వాత రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ టైంలోనే మంత్రి అయ్యన్నపాత్రుడితో స్నేహం కుదిరింది. చివరికి రెండు దశాబ్దాల క్రితం టీడీపీ టికెట్ సంపాదించారు. ఎంపీగా అనకాపల్లి నుంచి గెలిచారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు రాజకీయం చాలా దూకుడుగా ముందుకు సాగింది.

గంటా శ్రీనివాసరావు టీడీపీలో కొద్దికాలంగా అసంతృప్తితో ఉంటున్నారు. అప్పట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో కలిసి చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి.. గంటాతోపాటు పది మంది వరకూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో గంటా టీడీపీని వీడలేదు. బీజేపీలో చేరలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వ్యూహాత్మకంగా వెళ్లి మంత్రి పదవులు అనుభవించే గంటా లెక్క ఈసారి తప్పింది. ఆయనను వైసీపీలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ రాజీనామా చేస్తే గానీ జగన్ రానీవ్వరు. దీంతో అధికారానికి దూరంగా టీడీపీలో ఉండలేకపోతున్నారు. అటూ బీజేపీ, వైసీపీలోకి చేరలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి కూడా గంటా హాజరు కావడం లేదు. దీంతో గంట పార్టీ మారుతారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసే ఛాన్స్..?

గత టీడీపీ ప్రభుత్వంలో గంటా మంత్రిగా ఉత్తరాంధ్రను ఏలారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. గంటా ఒక శక్తిగా మారారనే టాక్ ఉంది. నిజాయతీగా వ్యాపారం చేయాలనుకునేవారు… కంపెనీలు నడపాలనుకునేవారికి ఈ గంటా స్పెషల్ ట్యాక్స్ ఒక పెద్ద అడ్డంకిగా భావించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి జారిపోవడంతో ఆయన అధికార పార్టీవైపే ఎప్పుడూ చూస్తుంటారని తెలుస్తోంది. తమవాడు అధికార పార్టీలో ఉంటే ఆ లాబీలకు ఒక రకమైన ధైర్యమని ఆయన భావిస్తుంటారని ఆయన అనుయాయులు అంటుంటారు. అలాంటి గంటా అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై నానా వాగుడు వాగాడు. దాన్ని వైసీపీ కార్యకర్తలు తట్టుకోలేక నిరసనలకు దిగారు. కానీ ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి మళ్లీ వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని కొద్ది కాలంగా ప్రచారం నడుస్తోంది. రెండు, మూడు సార్లు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ.. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన రాకను మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్నారని వైసీపీలో ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన సజ్జల ద్వారా వైసీపీలో చేరడానికి రూట్ క్లియర్ చేసుకున్నారని కూడా అనుకున్నారు. ఈ కారణంగా టీడీపీ కూడా ఆయనకు ఎలాంటి పార్టీ పదవులు కల్పించలేదు. ఆయనను పట్టించుకోవడమే మానేశారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే గంటాకు చెందిన కొన్ని ఆస్తులను కూల్చేస్తారని చెప్పుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన స్టే తెచ్చుకుని కాపాడుకున్నారు. ఆ తర్వాత సైలెంటయ్యారు.

ఇప్పుడు గంటా పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అటు టీడీపీలోనూ ఆయన యాక్టివ్ గా లేరు. ఇటు వైసీపీతోనూ పోరాడకుండా ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు కూడా గంటా ఇలానే సైలెంట్ గా ఉంటారని.. అప్పుడు గెలిచే పార్టీని అంచనావేసి చేరుతారనే ప్రచారం ఉంది. మరి ఈ నాలుగేళ్లు గంటా మౌనాన్ని ఆశ్రయిస్తారని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్