ప్రీపోల్ సర్వే: జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కే మొగ్గు?

ఇప్పుడు దేశమంతా జీహెచ్ఎంసీ వైపే చూస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్టు ఒక్క బక్క పలుచని గులాబీ దళపతిని కొట్టడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా., పరోక్షంగా మోడీ హైదరాబాద్ వచ్చారంటే ఈ ఎన్నిక బీజేపీకి ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ను ఓడించాలని కేంద్రంలోని బీజేపీయే కదిలివచ్చిన ఈ పోరాటం నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రచారం పర్వం ముగిసింది. రేపే గ్రేటర్ ఎన్నికల […]

Written By: NARESH, Updated On : November 30, 2020 8:54 pm
Follow us on

ఇప్పుడు దేశమంతా జీహెచ్ఎంసీ వైపే చూస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్టు ఒక్క బక్క పలుచని గులాబీ దళపతిని కొట్టడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా., పరోక్షంగా మోడీ హైదరాబాద్ వచ్చారంటే ఈ ఎన్నిక బీజేపీకి ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ను ఓడించాలని కేంద్రంలోని బీజేపీయే కదిలివచ్చిన ఈ పోరాటం నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ప్రచారం పర్వం ముగిసింది. రేపే గ్రేటర్ ఎన్నికల పోలింగ్. ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ లో మాటల తూటాలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకున్నారు.

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీకి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. 2024 ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాను ఇచ్చింది. అందుకే అతిరథ బీజేపీ మహారథులు హైదరాబాద్ పై దండెత్తారు.

ఈ నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలు బయటకు వచ్చాయి. కొన్ని సంస్థలు చేసిన ఈ సర్వే రిపోర్టులు విడుదయ్యాయి. అవిప్పుడు వైరల్ గా మారాయి.

ఏబీపీ-సీ ఓటర్ సర్వే ప్రకారం.. గ్రేటర్ లో కారు పార్టీ ఏకంగా 92-94 సీట్ల వరకు సాధించుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇదే కనుక జరిగితే కేసీఆర్ మరోసారి పట్టు నిలుపుకున్నట్టే లెక్క. గత జీహెచ్ఎంసీలో 99 సీట్లు సాధించిన టీఆర్ఎస్ 90 దాటినా  ఆ పార్టీ హవా కొనసాగినట్టే లెక్క. ఇక బీజేపీకి 10-12 కార్పొరేటర్ సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. జాతీయ నాయకులు అమిత్ షా, నడ్డా వచ్చినా ఇన్నే సీట్లు గెలిస్తే అది బీజేపీకి శరాఘాతం కిందే లెక్క. ఇక ఎంఐఎంకు 38-42 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీకి 2-4 సీట్లు సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది.

అయితే మరో సర్వేలో టీఆర్ఎస్ కు 60, బీజేపీకి 25 సీట్లు వస్తాయని.. మరో సర్వేలో 40 డివిజన్లు వస్తాయని తేలింది. ఇది నిజమైన సర్వేనా లేక సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందా అన్నది తేలాల్సి ఉంది. అయితే 40 వచ్చినా సరే ఎక్స్ ఆఫీషియోతో టీఆర్ఎస్ దే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తి ఫలితం మాత్రం డిసెంబర్ 4 వరకు పూర్తి స్పష్టత రానుంది.