లాక్ డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను సొంత గ్రామాలకు చేర్చడానికి జగన్ సర్కార్ తీసుకున్న చొరవకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అందుకు కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పవన్ వెల్లడించారు.
గతంలో శ్రీకాకుళం జిల్లా నాయకులు మత్స్యకారుల గురించి ఆయనకు తెలిసిన వెంటనే ట్విటర్ ద్వారా చేసిన విజ్ఞప్తికి తక్షణం స్పందించి మత్స్యకారులకు కావలసిన ఆహార పదార్ధాలను అందించిన గుజరాత్ ప్రభుత్వ అధికారులకు కూడా పవన్ కృతఙ్ఞతలు చెప్పారు. 36 బస్సులలో సుమారు 3800 మంది గుజరాత్ లోని వెరావల్ తీర ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరారని తెలిసి తను చాలా సంతోషిస్తున్నట్లు పవన్ తెలిపారు. కిషన్ రెడ్డి చొరవతో మత్స్యకారుల తరలింపునకు మూడు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసారు.