ఆ ఒక్కడు ఇప్పుడు అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి మధ్య అడ్డంగా నిలబడ్డాడు. అతడు ఎవరికి మద్దతిస్తే వారే చైర్మన్. ఇవ్వకపోతే పీఠం కదిలిపోతుంది. పోనీ ఇతడికి ఏ పార్టీ మద్దతిచ్చినా ఇతడే చైర్మన్. కర్ణాటకలో కుమారస్వామిలా.. ఇప్పుడు మైదుకూరులో గెలిచిన ఏకైక జనసేన కౌన్సిలర్ కింగ్ మేకర్ లా అవతరించాడు. అతడి ఓటు మైదుకూరు మున్సిపల్ చైర్మన్ ను డిసైడ్ చేసేలా ఉంది. దీంతో అతడి కోసం వైసీపీ, టీడీపీలు అర్రులు చాస్తున్న పరిస్థితి నెలకొంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. కార్పొరేషన్లు, నగర పంచాయతీల, మున్సిపాలిటీలు అన్నింటిని కైవసం చేసుకుంది. ఒక్క అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు తప్ప అన్ని చోట్లా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఈ రెండు మున్సిపాలిటీలపైనా వైసీపీ తాజాగా కన్నేసింది.
ఎక్స్ అఫీషియో ఓట్లతో జెండా ఎగురవేయాలని వైసీపీ భావిస్తోంది. నంబర్ గేమ్ మొదలు పెట్టింది. టీడీపీ ముందుగానే జాగ్రత్త పడి కౌన్సిలర్లను క్యాంకులకు తరలించింది. దీంతో మైదుకూరు మున్సిపాలిటీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది.
మైదుకూరులో 24 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 స్థానాలు గెలుచుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ 19వ వార్డులో గెలిచిన జనసేన అభ్యర్థిపై ఆశలు పెట్టుకుంది.
వైసీపీకి ఎక్స్ అఫిషియో ఓట్లు కలిసొస్తున్నాయి. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి , కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎక్స్ ఆఫిషియో ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి , మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , శివనాథ్ రెడ్డిలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండడంతో వారికి అవకాశం కల్పించలేదు.
ఈ క్రమంలోనే జనసేన కౌన్సిలర్ టీడీపీకి జైకొడితే వైసీపీ, టీడీపీలకు చెరో 13 ఓట్లు వచ్చి డ్రా అవుతుంది. అప్పుడు లాటరీ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో వైసీపీకి మద్దతిస్తే వైసీపీ చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకుంటుంది. దీంతో ఇప్పుడు మైదకూరులో టీడీపీ కౌన్సిలర్ కింగ్ మేకర్ గా ఉన్నాడు. అతడు ఎవరికి మద్దతిస్తే వారే మైదుకూరు చైర్ పర్సన్ అవుతారు.లేదంటే అతడినే చైర్ పర్సన్ చేసి పార్టీలో కలిపేసుకునేందుకు టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
