హైదరాబాద్ నగరంలో ఎన్నికల వేడిరాజుకుంది. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా ప్రతిపక్షాల పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన జోష్ తో బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లురుతోంది. ఏకంగా మేయర్ పీఠంపైనే కన్నేసింది.
Also Read: విప్లవాభిమానులకు షాక్.. కేసీఆర్ గళాన్ని విన్పిస్తున్న గద్దరన్న..!
అధికార టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో బీజేపీ ఎక్కడ కూడా తగ్గడం లేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. బీజేపీని ఇరుకునపెట్టేలా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండటంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
తాజాగా టీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ ఆరోపణలు గుప్పించారు. చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దీనికి బండి సంజయ్ తనదైన శైలిలో ధీటుగా జవాబిచ్చారు. తాను ఎన్నికల సంఘానికి లేఖ రాయలేదని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తానని.. కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని నిన్న సవాల్ విసిరారు.
Also Read: గ్రేటర్ ఫైట్: అభాసుపాలైన పవన్.. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా..?
బండి సంజయ్ చెప్పినట్లుగా నేటి మధ్యాహ్నం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆయన రాకతో బీజేపీ శ్రేణులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఒంటిగంట వరకు సీఎం రాకకోసం వెయిట్ చేసిన బండి సంజయ్ కేసీఆర్ వచ్చేలా లేరని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికలనేవి వస్తాయి పోతాయని.. అయితే నేతలు ప్రజాస్వామ్యం అపహస్యం చేయద్దని బండి సంజయ్ కోరారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నగర ప్రజలు గుర్తించి ఈసారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరారు. బీజేపీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే ఈసారి బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునేలా కన్పిస్తుందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్