
Jasprit Bumrah: వెన్ను నొప్పి కారణంగా చాలా రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంపై షాకింగ్ వార్త వినిపిస్తోంది. చాలాకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న బూమ్రా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మాచ్ల్లో మాత్రమే కనిపించాడు. అందులో ఒక్క మ్యాచ్లోనే బౌలింగ్ చేశాడు. వెన్నునొప్పి తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టుతో చేరతాడని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. పునరాగమనంపై తాజా వార్త ఇటు టీమిండియాను, అటు ముంబై ఇండియన్స్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
ఆసీస్ సిరీస్ మొత్తానికి దూరం..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో బుమ్రా పునరాగమనం చేస్తాడని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ సిరీస్కు ప్రకటించిన జట్టులో కూడా బుమ్రా పేరు లేదు. దీంతో అతను ఐపీఎల్లోనే మళ్లీ బౌలింగ్ చేస్తాడని కొందరు అన్నారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు అతను ఐపీఎల్ కూడా ఆడటం కష్టమే అని తెలుస్తోంది. ఇంకా గట్టిగా మాట్లాడితే జూన్లో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో కూడా బుమ్రా ఆడటం అనుమానమే అంటున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా కష్టమే..
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు వరల్డ్ టెస్ట్ చాంపియన్ సిరీస్ ఫైనల్కు చేరడం దాదాపు ఖాయమైంది. ఆసీస్పై మరొక్క మ్యాచ్ గెలిస్తే భారత్ ఈ టోర్నీ ఫైనలకు చేరినట్లే. ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లండ్లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ సమయానికి బుమ్రా జట్టుతో చేరతాడని అంతా అనుకున్నారు. కానీ అది జరిగేలా లేదు. బుమ్రా లేకపోయినా కూడా భారత జట్టు బాగానే రాణిస్తోంది. కానీ బుమ్రా కూడా జట్టుతో చేరితే బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

ముంబై జట్టుకు కష్టాలే..
త్వరలో జరిగే ఐపీఎల్కు బూమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై జట్టు యాజమాన్యంతోపాటు, ఆ జట్టు ఫ్యాన్స్ భావించారు. కానీ బుమ్రా పూర్తిగా కోలుకోలేదన్న వార్తలు ఇప్పుడు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. అతను ఐపీఎల్ ఆడకపోతే ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. గతేడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ముంబై.. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. వీటికి బుమ్రా లేని లోటు పెద్ద దెబ్బే. కానీ గతేడాది గాయం కారణంగా పూర్తిగా ఐపీఎల్ మిస్ అయిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ ఈ జట్టుతో కలవడం ముంబైకి ఊరటనిచ్చే అంశం.