Sleeping Tips: ప్రస్తుతం చాలా మందిలో నిద్ర తక్కువ ఫోన్ తో గడపడం ఎక్కువ. సోషల్ మీడియా మాయలో పడి సమయాన్ని మర్చిపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ తో టైమ్ పాస్ చేసేవారు కొందరు అయితే.. రాత్రి కూడా నిద్రాహారాలు మాని
ఆరోగ్యాన్ని కూడా మర్చిపోయేవారు మరికొందరు. ఇలాంటి వారు ఎంత సేపు నిద్ర పోతున్నారో వారికి కూడా తెలియదు. అయితే టెన్షన్, గొడవలు, ఫోన్ ఇలా ఎన్నో రకాల సమస్యలతో రాత్రి నిద్ర కరువైందనే చెప్పాలి. మధ్య వయసు వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఎందుకు వస్తుందనేది తెలుసా? అయితే ఈ వివరాలు మీకోసం..
30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో నిద్ర సమస్య ఉండడం కామన్ గా జరుగుతుంది. నిద్రలో పదే పదే అంతరాయం కలిగితే పది సంవత్సరాల తర్వాత ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి సమస్యల బారిన పడుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో సైంటిస్టులు అధ్యయనం చేసి జర్నల్ న్యూరాలజీ నివేదికను విడుదల చేశారు. ఇందులో నిద్రకు సంబంధించిన విషయాలను పొందుపరిచారు. నిద్రలేమి సమస్య, నిద్రలో అంతరాయం కలగడం వల్ల జరిగే సమస్యల గురించి తెలిపారు.
అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడటానికి చాలా సంవత్సరాల ముందే మెదడులో వ్యాధి పేరుకొని పోతుందట. అయితే నిద్రకు, జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఈ సమస్యను తెలుసుకున్నారు. సరైన నిద్ర లేకపోతే వ్యాధులు తొందరగా వస్తాయని.. కొన్ని వ్యాధులకు ప్రధాన కారణం నిద్ర అని తెలిపారు యా లెంగ్. అంతేకాదు మధ్య వయసు ఉన్న వారిలో గాఢ నిద్ర చాలా అవసరం అని వారి అధ్యయనంలో తేలిందన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యం. వయసును బట్టి నిద్ర సమయం కేటాయించాల్సిందే.. లేదంటే వ్యాధులకు వెల్ కమ్ చెప్పినట్టే అవుతుంది. అందుకే హాయ్ గా నిద్రను ఎంజాయ్ చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..