Mobile Recharge Price Hike: నిత్యావసర వస్తువులు, ఇతర సేవల ధరల పెరుగుదలతో ఇప్పటికే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు టెలికం రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు కూడా వినియోగదారులకు గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ పరిశోధనా సంస్థ Centrum Institutional Research తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అవెలా ఉంటాయంటే?
రాబోయే 3 నుండి 4 నెలల కాలంలో టెలికం కంపెనీలు తమ టారిఫ్ (రీఛార్జ్ ప్లాన్ల) ధరలను 12 నుండి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్పై అదనపు భారం పడే అవకాశం ఉంది. టెలికం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు నెట్వర్క్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా 4G మరియు 5G నెట్వర్క్ల విస్తరణ వేగంగా జరగడమే ధరల పెంపునకు గల ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల సాధారణ వినియోగదారుల డేటా వినియోగం మునుపెన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ఈ పెరిగిన డిమాండ్కు అనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని, నాణ్యతను మెరుగుపరచడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.
మరోవైపు, ప్రస్తుత జూన్ త్రైమాసికంలో టెలికం కంపెనీల ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ – ప్రతి వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయం) 1 నుండి 1.5 శాతం వరకు పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. అయితే, కంపెనీలు దీర్ఘకాలికంగా లాభాల్లో కొనసాగాలన్నా, తదుపరి సాంకేతికతను తట్టుకోవాలన్నా ARPU మరింత పెరగడం అవసరమని భావిస్తున్నాయి. అందుకే, రానున్న పండుగల సీజన్ లేదా తదుపరి త్రైమాసికం లోపు వినియోగదారులపై టారిఫ్ పెంపు భారాన్ని మోపడానికి టెలికం దిగ్గజాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.
