July 2026 Rules Changes: జూన్ ముగిసి జూలై నెల ప్రారంభం అవుతున్న తరుణంలో కొన్ని ఆర్థిక అంశాల్లో మార్పులు జరగబోతున్నాయి. సామాన్యుల నుంచి ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, ప్రయాణికులు వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాస్పోర్ట్ ఫీజుల పెంపు, ఆధార్ ఈ-మెయిల్ అప్డేట్కు ఉచిత అవకాశం, ఎస్బీఐ-ఫోన్పే క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల నిబంధనల్లో మార్పులు, ఆదాయపు పన్ను రిటర్నుల గడువు వంటి అంశాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం చూపనున్నాయి. ఇవి ఏ విధంగా మారుతున్నాయి? ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి?
ఐటీ రిటర్న్ గడువు:
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. గడువులోపు రిటర్నులు దాఖలు చేయని వారికి ఆలస్య రుసుము, వడ్డీతో పాటు కొన్ని పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే రీఫండ్ రావాల్సి ఉన్నవారు కూడా ఆలస్యం చేయకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిది. అవసరమైన ఫారమ్-16, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరు నెలల పాటు ఆధార్ అప్డేట్ ఉచితం:
ప్రస్తుతం ఆధార్లో ఈ-మెయిల్ ఐడీ అప్డేట్ చేసుకోవడానికి రూ.75 ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అయితే జులై 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఈ సేవను ఉచితంగా అందించనున్నట్లు యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది. డిజిటల్ సేవలు, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, ఓటీపీ ఆధారిత ధృవీకరణలు సజావుగా సాగాలంటే ఆధార్లో సరైన ఈ-మెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేసి ఉండటం ఎంతో అవసరం.
పాస్పోర్ట్ ఫీజులు భారీగా పెంపు:
విదేశాలకు వెళ్లే వారు, కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది. తత్కాల్ సేవకు రూ.3,500 స్థానంలో రూ.5,000 చెల్లించాలి. 60 పేజీల పాస్పోర్ట్ రుసుము రూ.2,000 నుంచి రూ.3,500కు పెంచగా, తత్కాల్ సేవకు రూ.6,000గా నిర్ణయించారు. 18 సంవత్సరాల లోపు వారికి కొత్త పాస్పోర్ట్ రుసుము రూ.1,000 నుంచి రూ.1,750కు పెరగనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వారు ఈ పెంపును దృష్టిలో ఉంచుకోవాలి.
ఫోన్పే క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లలో మార్పులు:
ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ వినియోగదారులకు రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. కొన్ని కేటగిరీలలో రివార్డు పాయింట్లకు పరిమితులు విధించనుండగా, కొన్ని లావాదేవీలపై పాయింట్ల లెక్కింపు విధానాన్ని కూడా సవరించారు. దీంతో క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించే వారు కొత్త నిబంధనలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.
ఈ మార్పులు ఎవరిపై ప్రభావం చూపుతాయి:
విదేశీ విద్య, ఉద్యోగం లేదా పర్యటన కోసం పాస్పోర్ట్ తీసుకోవాలనుకునే వారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ వివరాలు నవీకరించాలనుకునే పౌరులు, అలాగే ఎస్బీఐ-ఫోన్పే క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ మార్పుల వల్ల నేరుగా ప్రభావితమవుతారు. చిన్న మార్పులుగా కనిపించినా, సమయానికి స్పందించకపోతే అదనపు ఖర్చులు లేదా సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
