YSRCP : జగనన్న పిలిస్తే మళ్లీ యాక్టివ్ అవుతానని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ). కొద్ది రోజుల కిందట ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ కలిసి దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడారు. త్వరలో కలుస్తానని జగన్ తో దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం దూకుడు పెంచారు. కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు ఆయనపై ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఆయన సైతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును కలిసి పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను తిరిగి యాక్టివ్ కాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దువ్వాడతోపాటు తమ్మినేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే ధర్మాన బ్రదర్స్ పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు.
* కుల రాజకీయాలు అధికం.. శ్రీకాకుళం( Srikakulam ) జిల్లాలో కుల రాజకీయాలు అధికం. అయితే వైసీపీలో ధర్మాన ఫ్యామిలీకి మంచి ప్రాధాన్యం దక్కుతోంది. ధర్మాన బ్రదర్స్ ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. మంత్రి పదవి ఆశించిన తమ్మినేని సీతారాం కు స్పీకర్ పదవి ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు జిల్లాలో. అయితే తన ఓటమికి ధర్మాన బ్రదర్స్ కారణమని దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ్మినేని సీతారాంకు ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించి ద్వితీయ శ్రేణి నాయకుడికి అప్పగించారు. కుటుంబ వివాదాలతో దువ్వాడ పై పార్టీ సస్పెన్స్ వేటు వేసింది. ఈ క్రమంలో తనకు ఇన్చార్జి పదవి దూరం కావడం వెనుక ధర్మాన బ్రదర్స్ పరోక్షం ఉందని తమ్మినేని అనుమానిస్తున్నారు. తనపై సస్పెన్స్ వేటు పడటానికి ధర్మాన బ్రదర్స్ కారణమని దువ్వాడ శ్రీనివాస్ బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు యాక్టివ్ కావడం చూస్తుంటే ధర్మాన బ్రదర్స్ కు వ్యతిరేకంగా పావులు కదపడమేనని తెలుస్తోంది.
* కులం ఈక్వేషన్..
దువ్వాడ శ్రీనివాస్ తో పాటు తమ్మినేని సీతారాం సామాజిక వర్గ ఫార్ములాతో ఇప్పుడు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే ఇప్పుడు ధర్మాన బ్రదర్స్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే ధర్మాన బ్రదర్స్ లో కృష్ణ దాస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల విధేయతతో ఉంటారు. అదే సమయంలో దువ్వాడ సైతం జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడతారు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం చాలా సందర్భాల్లో వ్యతిరేకంగానే మాట్లాడారు. తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అంతే. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు శ్రీకాకుళం జిల్లా విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరు దూరం అవుతారో తెలియని పరిస్థితి. అందుకే అందర్నీ ఒక చోటకు చేర్చాలని చూస్తున్నారు. అయితే వారి మధ్య విభేదాలు మాత్రం పతాక స్థాయికి చేరుకున్నాయి. ఒకవేళ వారి మధ్య రాజీ కుదిర్చినా.. లోలోపల మాత్రం విభేదాలు సమసి పోవని.. అంతిమంగా పార్టీకి నష్టం చేకూర్చుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో..